ఆ హీరోకు డబుల్ షాక్: తండ్రి గెలిచినా..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అధికార భారతీయ జనతా పార్టీ 63 నియోజకవర్గాలకే పరిమితమైంది. పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) బాగా నష్టపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 16 స్థానాలను జేడీఎస్ కోల్పోయింది. ప్రస్తుతం 22 నియోజకవర్గాల్లో జేడీఎస్ ఆధిక్యతలో ఉంది. ఇతరులు నాలుగు చోట్ల లీడింగ్లో ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 స్థానాలు అవసరం. ఈ మార్క్ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్.

కర్ణాటకలో విజయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా శ్రమించింది. ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయగలిగారు. హైకమాండ్ మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు క్యాడర్ను సమన్వయం చేసుకోగలిగారు.
కాంగ్రెస్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందంటే- అటు బీజేపీ, ఇటు జేడీఎస్ తమ కంచుకోటలను కోల్పోవాల్సి వచ్చింది. మంత్రులు డాక్టర్ కే సుధాకర్- చిక్బళ్లాపుర, వీ సోమన్న- వరుణ.. వంటి సీనియర్లు ఓడిపోయారు. బళ్లారి రూరల్లో బీ శ్రీరాములు ఓటమిబాటలో ఉన్నారు. బళ్లారి సిటీలో బీ సోమశేఖర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.
జేడీఎస్ ఈ దఫా ఎన్నికల్లో భారీగా నష్టపోయింది. గత ఎన్నికల్లో 37 నియోజకవర్గాలను గెలుచుకున్న కుమారస్వామి పార్టీ ఇప్పుడు 21 స్థానాల వద్ద నిలిచింది. ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. చెన్నపట్టణ నుంచి కుమారస్వామి గెలిచినప్పటికీ.. రామనగర నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కొడుకు, ప్రముఖ నటుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. గతంలో మండ్య లోక్సభ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నిఖిల్కు ఓటమి తప్పలేదు.
రామనగర కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ ఏ ఇక్బాల్ హుస్సేన్ చేతిలో నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. హుస్సేన్కు 72,898 ఓట్లు పోల్ అయ్యాయి. నిఖిల్కు 61,692 ఓట్లు పడ్డాయి. గతంలో రామనగర నియోజకవర్గానికి నిఖిల్ తల్లి అనిత కుమారస్వామి ప్రాతినిథ్యాన్ని వహించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నామమాత్రంగా పోటీ ఇచ్చారు. ఆయనకు పోల్ అయిన ఓట్లు 10,870.












Click it and Unblock the Notifications