JEE అడ్వాన్స్ పరీక్ష మళ్లీ వాయిదా -ఐఐటీల్లో ప్రవేశాలు మరింత ఆలస్యం -తదుపరి ఎప్పుడంటే..
దేశంలో కరోనా మహమ్మారి విలయం వల్ల విద్యా రంగం తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కీలకమైన పరీక్షలు చాలా వరకు రద్దయి, ఇంకొన్ని వాయిదాపడగా, ఇప్పుడు ఐఐటీల్లో ప్రవేశాలు కూడా మరింత ఆలస్యం కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్ష మరోసారి వాయిదా పడింది.
జులై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి పరీక్ష తేదీలను అనువైన సమయంలో ప్రకటిస్తామని జేఈఈ 2021 నిర్వాహకులైన ఐఐటీ ఖరగ్పూర్ బుధవారం ఒక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ పరీక్షను వాయిదా వేస్తూ గత నెలలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.

జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన టాప్ 2.5లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్ రాసే అవకాశముంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్లో ర్యాంక్ సాధించే విద్యార్థులు దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందొచ్చు. కరోనా కారణంగా జేఈఈ మెయిన్ మూడు, నాలుగు సెషన్ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నాలుగు విడతలో నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు విడతల పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించడంతో ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన సెషన్లను వాయిదా వేశారు. వాటిని రీషెడ్యూల్ చేసి త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కాగా,
కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో గడచిన 24 గంటల సమయంలో కొత్తగా 2,08,921 కేసులు, 4,157 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 20,06,62,456 డోసుల టీకాలను మాత్రమే ఇప్పటిదాకా పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications