సభ్య సమాజం సిగ్గుపడేలా!: ఉపాధ్యాయులే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..
ఓ పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బీహార్: స్కూల్.. ఇల్లు.. రోడ్డు.. ఇలా ఆడవాళ్ల భద్రతకు ప్రతీ చోట పరీక్షే ఎదురవుతోంది. ఎప్పుడు ఎవరి రూపంలో వారి మీద లైంగిక దాడి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆఖరికి చదువు చెప్పే ఉపాధ్యాయులు సైతం కామంతో కాటేస్తూ.. విద్యార్థినుల జీవితాలను బలిగొంటున్నారు.
తాజాగా బీహార్ లోని జిహానాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం నాడు చోటు చేసుకున్న ఈ ఘోరంపై బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. కాకో సెకెండరీ స్కూల్లో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థినిని అదే స్కూల్ కు చెందిన ప్రిన్సిపాల్, ముగ్గరు ఉపాధ్యాయులు బలవంతంగా భవనం పైకి లాక్కుపోయారు. అనంతరం ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. భవనంపై నిస్సహాయంగా పడివున్న బాలికను ఆమె తల్లి గుర్తించింది.
అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా బాధితురాలు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నట్టుగా గుర్తించారు. సాధారణంగా ఆదివారం నాడు స్కూల్ కు సెలవు అయినప్పటికీ.. శుక్రవారం నాడు సెలవు ఇచ్చిన కారణంగా.. ఆదివారం నాడు స్కూల్ నిర్వహించినట్టుగా సమాచారం. అదేరోజు ఈ దారుణానికి ఒడిగట్టారు.