ఇంటర్ పోల్ వాంటెడ్ టెర్రరిస్ట్, మసూద్ అజర్ కుడిభుజం.. ఇతడే: బాలాకోట్ పై దాడుల్లో హతమయ్యాడా?
Recommended Video
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున వైమానిక దళం చేపట్టిన దాడుల్లో యూసుఫ్ అజర్ హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. అతను హతమయ్యాడా? లేదా? అనే విషయం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. పాకిస్తాన్ లోని బాలాకోట్ పట్టణం సమీపంలో ఉన్న జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం చేసిన దాడుల్లో పెద్ద సంఖ్యలో జిహాదీలు, కమాండర్లు, ఉగ్రవాద శిక్షకులు హతమైనట్లు తమ వద్ద పూర్తి సమాచారం ఉందని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించినప్పటికీ.. వారిలో యూసుఫ్ అజర్ ఉన్నాడా? లేడా? అనేది తెలియ రావాల్సి ఉందని అన్నారు.
జైషె మహమ్మద్ కు చెందిన అతి పెద్ద శిక్షణ శిబిరంగా దీన్ని భావిస్తున్నామని, దీనికి యూసుఫ్ అజర్ చీఫ్ గా పనిచేస్తున్నారని అన్నారు. వైమానిక దాడులు చోటు చేసుకున్న సమయంలో యూసుఫ్ అజర్ సంఘటనాస్థలంలో ఉన్నాడా? లేడా? అనే విషయాన్ని ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉంది.
యుద్ధ ఖైదీగా పాకిస్తాన్ కు అప్పగింత..
నిజానికి యూసుఫ్ అజర్ ను కొన్నాళ్ల కిందటే అరెస్టు చేశారు పోలీసులు. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ కు అతను స్వయానా బావ. మనదేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున యూసుఫ్ అజర్ ను అరెస్టు చేశారు. 2002లో యుద్ధ ఖైదీల మార్పిడి సందర్భంగా మనదేశం అతణ్ని విడిచిపెట్టింది. యుద్ధ ఖైదీగా పాకిస్తాన్ కు అప్పగించింది. ఆ తరువాత పాకిస్తాన్ జైలు నుంచి బయటికి వచ్చిన యూసుఫ్ అజర్.. అనంతరం జైషె కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మసూద్ అజర్ కు కుడిభుజంగా మారాడు.
1999 విమానం హైజాక్ సూత్రధారి..
భారీ ఎత్తున జిహాదీలను తయారు చేయడం అతని పని. దీనికోసం బాలాకోట్ సమీపంలోని కొండ ప్రాంతాల్లో అతి పెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నెలకొల్పాడు. జిహాదీలుగా, ఫిదాయీలుగా యువతకు శిక్షణ ఇస్తున్నాడు. మంగళవారం నాటి వైమానిక దాడుల్లో ఈ శిబిరాన్ని ధ్వంసమైంది. పెద్ద సంఖ్యలో జిహాదీలు, కమాండర్లు, శిక్షకులు హతమయ్యారు. వారిలో యూసుఫ్ అజర్ ఉన్నాడా? లేడా? అనేది తేలాల్సి ఉంది.
రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్ పోల్..
ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ప్రకారం.. యూసుఫ్ అజర్ ఆలియాస్ మొహమ్మద్ సలీమ్ కరాచీలో జన్మించాడు. ఉర్దూ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. హైజాకింగ్, కిడ్నాపింగ్ సహా పలు హత్యల్లో అతనికి ప్రత్యక్ష ప్రమేయం ఉంది. 1999లో సంచలనం రేపిన ఐసీ 814 విమానం హైజాక్ లో యూసుఫ్ అజర్ అసలు సూత్రధారి. విమానాన్ని హైజాక్ చేయడం కోసం పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా పలుమార్లు భారత్ కు రాకపోకలు సాగించాడు. భారత్, నేపాల్ మధ్య చాలాసార్లు చక్కర్లు కొట్టాడని ఇంటర్ పోల్ ధృవీకరించింది.