సంక్షోభంలో జెట్ ఎయిర్వేస్ : సంస్థ ఆస్తులు విక్రయించే యోచనలో రుణదాతలు
ముంబై: ప్రముఖ దేశీయ విమానాయాన సంస్థ జెట్ఎయిర్వేస్కు కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు జెట్ ఎయిర్వేస్కు సంబంధించి దివాళా కేసులు విచారణచేసే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. చివరి ప్రయత్నంగా ఈ సంస్థను కొనుగోలు చేసే బిడ్డర్లకోసం చూస్తామని లేదంటే జెట్ ఎయిర్వేస్ ఆస్తులను వేలం వేసి తమకు రావాల్సినది తీసుకుంటామని హెచ్చరించారు. ఒకప్పుడు భారత్లోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్స్గా నిలిచిన జెట్ ఎయిర్వేస్ అప్పుల్లో కూరుకుపోయి తన సేవలను గతనెల ఏప్రిల్నుంచి నిలిపివేసింది. దీంతో ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించుకోలేక, విపరీతంగా ప్రయాణికుల ఛార్జీలు పెంచేసి ఇక ఫ్లోటింగ్ తక్కువ కావడంతో సేవలను నిలిపివేసింది.
ఇక ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న యోచనతో రుణదాతలు ఒక పరిష్కారం కోసం ఐబీసీని అప్రోచ్ అవుతున్నారు. దీంతో స్టేట్ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతలు ఈ సంస్థను అమ్మే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయినా లేక ఆ సంస్థకు చెందిన ఆస్తులను అయినా విక్రయించే అవకాశం లభిస్తుంది. వీటి అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులతో తమకు ఇవ్వాల్సిన అప్పులను తీర్చుకుంటారు రుణదాతలు. ఇప్పటి వరకు జెట్ ఎయిర్వేస్ సంస్థను ఎవరైనా కొనుగోలు చేస్తారేమో అని వేచిచూశారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం కోర్టునుంచే పొందాలని భావిస్తున్నారు.
జెట్ ఎయిర్వేస్ వాటాదారుడైన ఎతిహాద్ ఎయిర్వేస్ మరియు హిందూజా గ్రూపులు ముందుగా జెట్ఎయిర్వేస్ను పూర్తిగా కొనుగోలు చేయాలని భావించాయి. ఇప్పటికే జెట్ సంస్థ కొంత ఈ రెండు సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలైంది. జూన్ 20న విచారణకు రానుంది. ఇక జీతాల రూపంలో జెట్ ఎయిర్వేస్ పైలట్లకు రూ. 400 కోట్లు చెల్లించాల్సి ఉ:ది. వీరు కూడా న్యాయసలహా తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఇక జెట్ ఎయిర్వేస్కు సంబంధించి స్టాక్ మార్కెట్లలో కూడా ట్రేడింగ్ త్వరలో నిలిపివేస్తామనే ప్రకటన వెలువడింది.