గాలిలో విమానం: లండన్-ముంబై ఫ్లైట్లో కొట్టుకున్న పైలట్లపై వేటు, ఇకపై ప్రయాణికులే
న్యూఢిల్లీ: గాలిలో ఉన్న విమానంలో కాక్ పీట్ను వదిలేసి కొట్టుకున్న ఇద్దరు పైలట్లపై వేటు పడింది. వారిద్దరిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
గాలిలో విమానం: లండన్-ముంబై ఫ్లైట్లో కొట్టుకున్న పైలట్లు, వేడుకోలు
ఈ విషయాన్ని తాము సీరియస్గా పరిగణిస్తున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలకు అవకాశం కాకూడదనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
ఇకపై పైలట్లుగా కాదు.. ప్రయాణికులుగానే..
కాగా, ఈ పైలట్ల కొట్లాట వ్యవహారంనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు కూడా తీవ్రంగా స్పందించారు. ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్స్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి వారు పైలట్లుగా కాకుండా ప్రయాణీకులుగా మాత్రమే విమానాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే..
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బోయింగ్ 777 విమానం 324మంది ప్రయాణీకులు, 14మంది సిబ్బందితో బ్రిటన్ కాలమానం ప్రకారం జనవరి 1న ఉదయం పదిగంటలకు నూతన సంవత్సరం రోజే లండన్ నుంచి ముంబైకి బయలు దేరింది. మొత్తం తొమ్మిదిగంటలపాటు సాగే ఈ ప్రయాణం మధ్యలో విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఇద్దరు పైలట్ల మధ్య గొడవ మొదలైంది.
మహిళా కో-పైలట్పై చేయి చేసుకున్న పైలట్
కాక్పీట్ కెప్టెన్ కో-పైలట్ను చెంపచెల్లుమనిపించాడు. దీంతో ఆమె ఏడుస్తూ కాక్పీట్ నుంచి బయటకొచ్చింది. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్లి కన్నీటిపర్యంతమైంది. అయితే, ఇతర సిబ్బంది ఆమెను ఓదార్చి తిరిగి కాక్పీట్లోకి పంపించారు.
ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
అనంతరం కూడా వారిద్దరు తీవ్రంగా మరోసారి గొడవపడి.. కాక్పీట్ను ఇద్దరూ వదిలేయడం జరిగింది. కాగా, కో-పైలెట్ మరోసారి అందులోకి వెళ్లేందుకు నిరాకరించగా.. ప్రయాణీకులను సురక్షితంగా చేర్చాలన్న సిబ్బంది వేడుకోలు మేరకు ఆమె అంగీకరించింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో సిబ్బందితోపాటు ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.