ముంబైకి బ్రస్సెల్స్ ఉగ్రదాడి బాధితురాలు నిధి చాపేకర్
ముంబై: గత మార్చిలో బ్రస్సెల్స్ ఎయర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగిని నిధి చాపేకర్ శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. 42 ఏళ్ల నిధి చాపేకర్ గాయాల నుంచి కొంతమేరకు కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ముంబైకి తిరిగి వచ్చారు.
ప్రపంచాన్ని కదలించిన ఫోటో: ఆమె ఎవరో తెలిసింది
మార్చి నెలలో బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన నిధి చాపేకర్ అక్కడ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. అయితే ఇంకా 15 శాతం గాయాల నుంచి కోలుకోవాల్సి ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబైకి చేరుకోగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు.
ఆమె రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు. 1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్ మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఆ సమయంలో ఎయిర్ పోర్టులో ఉగ్రదాడి జరగడంతో ఆమె శరీరానికి 15 శాతం గాయలు అవ్వడంతో పాటు చీలమండ విరిగిపోయింది. ఈ ఉగ్రదాడిలో జరిగినప్పటి నుంచి ఆమె బ్రసెల్స్కు సమీపంలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందారు.
అనంతరం గురువారం సాయంత్రం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నిధి చాపేకర్ ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థతి ఏర్పడింది.
దీంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఆమెతో పాటు బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన ఉగ్రదాడిలో గాయపడిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.