డ్రైనేజ్ నుండి కన్నం: సినిమా ఫక్కిలో చిక్కిపోయారు
బెంగళూరు: డ్రైనేజ్ నుండి బంగారు నగల షోరూంకు కన్నం వెయ్యడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సినిమా ఫక్కిలో వీరు నగలు లూటీ చెయ్యడానికి ప్రయత్నించారు.
బెంగళూరు - కనకపుర రోడ్డులో ప్రియదర్శిని జ్యువెలర్స్ షో రూం ఉంది. ఈ షోరూం భవనం పక్కనే పెద్ద డ్రైనేజ్ ఉంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన షబ్బీర్, హుస్సేన్, మహమ్మద్, ఇస్మాయిల్ అనే నలుగురు బంగారు నగల షాప్ లూటీ చెయ్యాలని ప్లాన్ వేశారు.
డ్రైనేజ్ లో నుండి షో రూంలోకి సోరంగం పెట్టాలని నిర్ణయించారు. డ్రైనేజ్ లో నుండి షో రూంలోని 100 మీటర్లు పొడవు ఉంటుంది. గురువారం రాత్రి నిందితులు అందరూ డ్రేనేజ్ లోకి వెళ్లారు. తరువాత కొన్ని పరికరాలు ఉపయోగించి రంధ్రం పెడుతున్నారు.
పక్క వీదిలో నివాసం ఉంటున్న ఒకరు మరణించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి మేలుకుని ఉన్నారు. కొందరు సిగరేట్ తాగడానికి బంగారు నగల షాప్ సమీపంలోకి వెళ్లారు. సిగరేట్ తాగుతున్న సమయంలో డ్రేనేజ్ లో నుండి రాళ్లు పగలగొడుతున్న చప్పుడు వచ్చింది.
తరువాత వారికి అనుమానం వచ్చి లోపలికి తొంగి చూశారు. టార్చ్ లైట్ వేస్తున్న విషయం గుర్తించారు. గస్తి తిరుగుతున్న పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి పై అధికారులకు సమాచారం ఇచ్చారు.
సుమారు 20 మంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను ఒక్కోక్కరిని డ్రైనేజ్ లో నుండి బయటకు లాగారు. ఆ సందర్బంలో ఇస్మాయిల్ అనే నిందితుడు తప్పించుకున్నాడు. దోమలు, క్రిములు భారి నుండి రక్షించుకోవడానికి నిందితులు శరీరం మొత్తం కిరోసిన్ పూసుకున్నారని పోలీసులు తెలిపారు.