‘మోడీయే మా హీరో’: స్వచ్ఛభారత్లో నూతన సిఎం రఘువర్దాస్
రాంచీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీయే తమ ‘హీరో'(నాయకుడు) అని, ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగం పుంజుకుంటుందని జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రి రఘువర్దాస్ అన్నారు. భారతీయ జనతా పార్టీ-ఎజెఎస్యు సంకీర్ణ ప్రభుత్వ సారథిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆదివారం రాంచీలో మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని పరిపాలించనున్నట్లు స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పథకం కింద రాంచీని ‘స్మార్ట్ సిటీ'గా అభివృద్ధి చేసేందుకు కేంద్రాన్ని సంప్రదిస్తామన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే రఘువర్దాస్ ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొని రాంచీలోని కరాంటోలీలో రోడ్డును శుభ్రం చేశారు. రాష్ట్రంలో ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, రఘువర్దాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా హాజరు కాలేదు. ఢిల్లీలో ఆదివారం దట్టంగా పొగమంచు అలుముకోవడతో వారు జార్ఖండ్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లనే ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని, జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రఘువర్దాస్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మోడీ ‘ట్విట్టర్' ద్వారా పంపిన సందేశంలో పేర్కొన్నారు.
సుస్థిరతకు ఓటు వేసిన జార్ఖండ్ ప్రజలను అభినందిస్తున్నానని, అభివృద్ధిలో జార్ఖండ్ను మున్ముందు సరికొత్త శిఖరాలకు చేర్చాల్సిందిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మోడీ తన సందేశంలో పేర్కొన్నట్లు బిజెపి మీడియా ఇన్చార్జి శ్రీకాంత్ శర్మ తెలిపారు.