రైల్వే ట్రాక్ పై 19 ఏళ్ల యువతి రీల్స్.. వెనుక నుంచి రైలు ఢీకొట్టడంతో..
ఇటీవలికాలంలో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ఎక్స్ మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు పోస్టులు, వీడియోలు, ఫొటోలు పెడుతూ ఫాలోవర్స్ ను పెంచుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని కొందరు వింత వింత కాన్సెప్ట్స్ తో రీల్స్ చేస్తుంటారు. ఇంకొందరు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకునేంతగా రీల్స్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు అధికం అవుతున్నాయి. క్షణాల్లో ఫేమస్ అయిపోవాలని కొందరు రైలు పట్టాలపై ప్రమాదకరంగా రీల్స్ తీస్తుంటారు. అలా సోషల్ మీడియాలో లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇదే క్రమంలో అనుకోకుండా ప్రమాదం జరిగి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.
ఇలాంటి ఆకతాయిల ఆటలను అరికట్టేందుకు రైల్వే శాఖ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వాటిని బ్రేక్ చేస్తూ సోషల్ మీడియా మెప్పు కోసం యువతీ యువకులు ప్రమాదకరంగా రీల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. రైల్వే ట్రాక్ వద్ద రీల్స్ చేస్తున్న ఓ 19 ఏళ్ల యువతిని వెనుక నుంచి వచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు చేతులు కోల్పోయింది. అంతేకాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిండు జీవితం ఉన్న ఆ యువతి ఇప్పుడు చిన్న వయసులోనే జీవచ్ఛవంలా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ లోని గఢ్వా జిల్లాకు చెందిన ధీరజ్ సింగ్ కుమార్తె పూర్ణిమ(19) కు సోషల్ మీడియాలో రీల్స్ చేయడమంటే పిచ్చి. రీల్స్ చేస్తూ ఎప్పుడూ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేసేందుకు గఢ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోబరీయా గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లింది. ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు పూర్ణిమను ఢీ కొట్టింది. వెంటనే ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు చేతులు కోల్పోయింది. అంతేకాక శరీరంలోని ఇతర భాగాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక పూర్ణిమకు జరిగిన ప్రమాదాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరోవైపు రైల్వే ట్రాక్ లు.. రైల్వే డిపార్ట్ మెంట్ కు చెందిన ఏ ప్రదేశంలో అయినా రీల్స్ కానీ స్టంట్స్ కానీ చేస్తే అటువంటి వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయాలని రైల్వే బోర్డు అధికారులను ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కోసం యువకులు రైళ్లలో వీడియోలు తీస్తున్న సంఘటనలు అధికం అవుతున్న తరుణంలో ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రీల్స్ తీసే వారిపై జీరో టోలరెన్స్ విధానాన్ని అవలంబించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులను రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications