పాకిస్తాన్ జిన్నానా? భారతమాతా?: ఢిల్లీ ఓటర్లే తేల్చుకోవాలన్న కేంద్ర మంత్రి జవదేకర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ నేతల దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన కొద్దిసేపటికే.. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం అదే తరహా కామెంట్లు చేయడం వివాదాస్పదమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తోన్న జవదేకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు.

జిన్నా వర్సెస్ భారతమాత
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో గత 40 రోజులుగా నిరవధిక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఉద్యమం వెనుక చీకటి శక్తులు ఉన్నాయని, ఆ చీకటి శక్తులకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అండగా నిలిచాయని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాగ్ లో నిరసనకారులు.. ‘జిన్నా కోరిన స్వాతంత్ర్యం(జిన్నా వాలీ ఆజాదీ)‘ అంటూ నినాదాలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ.. ‘‘ఇప్పుడిక ఢిల్లీ ఓటర్లే తీర్పు చెప్పాలి.. పాకిస్తాన్ జిన్నా కావాలో? భారతమాతకు జై అంటారో నిర్ణయించుకోవాలి''అని అన్నారు.

పోహాపైనా వివాదం..
బంగ్లాదేశీలు ఎక్కువగా పోహా(అటుకులు) తింటారని, తన ఇంట్లో పనివాళ్లు పోహా తినడం చూసి, వాళ్లను బాగ్లాదేశీయులుగా అనుమానించానని బీజేపీ జాతీయ నేత విజయ్ వర్గియా చేసిన కామెంట్లపైనా వివాదం రాజుకుంది. వివర్గియా కామెంట్లను ఖండించిన కేంద్రమంత్రి జవదేకర్.. తాను కూడా పోహా(అటుకులు) తింటానని, కావాలంటే జర్నలిస్టులకు కూడా వడ్డిస్తానని చెప్పుకొచ్చారు.

వరుసగా బీజేపీ నేతలే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి కూడా విజయం సాధిస్తుందని అంచనాలు వెలువడ్డ తర్వాత బీజేపీ నాయకులు ఎదురుదాడి ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నవాళ్లంతా బీజేపీ నేతలే కావడం గమనార్హం. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనుంది.












Click it and Unblock the Notifications