1 జీబీపీఎస్ వేగం, 1000 జీబీ డేటాతో.. త్వరలో జియో బ్రాడ్బ్యాండ్..!?
త్వరలోనే జియో నుంచి బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 1 జీబీపీఎస్ వేగంతో నెలకు 100 నుంచి1000 జీబీ డేటా వరకు ప్లాన్స్ అందించనున్నట్లు తెలుస్తోంది.
ముంబై: త్వరలో జియో బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మొబైల్ నెట్ వర్క్ ద్వారా ఉచిత 4జీ డేటా, కాల్స్, ఎస్సెమ్మెస్ లను ఇవ్వడంలో రిలయన్స్ జియో ఏ విధంగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడిక జియో బ్రాడ్బ్యాండ్ సేవల్లోకి దిగుతోంది. మరి ఈ సేవలతో యూజర్లకు గరిష్టంగా లభించనున్న ఇంటర్నెట్ డేటా ఎంతో తెలుసా? అక్షరాలా 1000 జీబీ..! అవును, మీరు చదివింది నిజమే.
నెలకు 1000 జీబీ డేటా వరకు అందించే ప్లాన్లను జియో తన బ్రాడ్బ్యాండ్ సేవల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 1 జీబీపీఎస్ వేగంతో నెలకు 100 జీబీ వరకు ఉచిత డేటా మొదలుకొని 10 జీబీపీఎస్ వేగంతో నెలకు గరిష్టంగా 1000 జీబీ వరకు డేటా ఇచ్చేలా జియో బ్రాడ్బ్యాండ్ సేవలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే జియో తన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ముంబై, పూణెలలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. కొంతమంది యూజర్లకు ఇప్పటికే ఉచితంగా ఈ సేవలను జియో అందిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో వారు తమకు జియో బ్రాడ్బ్యాండ్ ద్వారా వస్తున్న ఇంటర్నెట్ వేగం వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. అయితే జియో బ్రాడ్బ్యాండ్ సేవలు అధికారికంగా ఎప్పుడు ప్రారంభం అవుతాయనేది మాత్రం తెలియడం లేదు. దీనిపై త్వరలోనే జియో ఒక ప్రకటన చేసే అవకాశముంది.