నడిరోడ్డు మీద కొట్టుకున్న ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ విద్యార్థులు: విరిగిన లాఠీ..తీవ్ర గాయాలు..!
అహ్మదాబాద్: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల ప్రభావం.. రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ రెండు విద్యార్థి సంఘాల ప్రతినిధులు నడిరోడ్డు మీద పరస్పరం దాడులకు దిగారు. ఘర్షణ పడ్డారు. సినీ ఫక్కీలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనేసంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేశారు. వారిని చెదరగొట్టారు.
ఎన్ఎస్యుఐ ర్యాలీ..
గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. జెఎన్యూ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ఈ ఉదయం అహ్మదాబాద్లో నిరసన ప్రదర్శనను చేపట్టింది. గుజరాత్కు చెందిన పలువురు విద్యార్థి సంఘాల నాయకులు దీనికి సంఘీభావం తెలిపారు. ఇందులో పాల్గొన్నారు. భారీ ఎత్తున విద్యార్థులను సమీకరించారు.

ర్యాలీని అడ్డుకున్న ఏబీవీపీ..
ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రతినిధులు అడ్డుకున్నారు. ర్యాలీని నిర్వహించడానికి అనుమతి ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు. పెద్ద ఎత్తున వాగ్వివాదానికి దిగారు. దీనితో ఇరు పక్షాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిని ఒకరు తోసుకున్నారు.. కొట్టుకున్నారు. బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించడానికి తీసుకొచ్చిన కర్రలతో పరస్పరం దాడికి దిగారు.
తీవ్రంగా గాయపడ్డ ఎన్ఎస్యుఐ నేత
ఈ ఘటనలో ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సావ్నీ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై ఇనుప రాడ్లతో దాడి చేయడంతో తల పగిలింది. వెంటనే అతణ్ని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు మరో 10మందికి పైగా ఎన్ఎస్యుఐ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డు మీద ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పోలీసుల లాఠీ ఛార్జీ
ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. వారు వినిపించుకోలేదు. దీనితో లాఠీఛార్జీకి దిగారు. కనిపించిన వారిని కనిపించినట్టే తరిమి కొట్టారు. పలువురు విద్యార్థులను వెంటాడి మరీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications