ఉపాధి అవ‌కాశాలా? ఉగ్ర‌వాద స‌మ‌స్యాః ఎన్నిక‌ల్లో పెను ప్ర‌భావం చూపే అంశాలివే..

న్యూఢిల్లీః జ‌మ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపుర వ‌ద్ద కింద‌టి నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాద దాడులు, అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై తెలుగుదేశం పార్టీ స‌హా కొన్ని రాజ‌కీయ పార్టీలు సందేహాలు లేవ‌నెత్తాయి. దేశంలో ఎన్నిక‌ల‌కు ముందే ఇలాంటి దాడులు గానీ, పాకిస్తాన్ తో యుద్ధ వాతావ‌ర‌ణం గానీ ఎందుకు ఏర్ప‌డుతుందంటూ బాహ‌టంగానే ప్ర‌శ్నించాయి. కేంద్రం అధికార‌లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికే పాకిస్తాన్ పై యుద్ధానికి కాలుదువ్వుతోందంటూ విమ‌ర్శించిన నాయ‌కుల‌కూ కొద‌వ లేదు.

ఉగ్ర‌వాదం, దాయాది దేశంతో యుద్ధ వాతావ‌ర‌ణం వంటి విష‌యాలు వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో నిజంగానే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తాయా? బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటిమికి వ‌రుస‌గా రెండోసారి కూడా అధికారాన్ని అప్ప‌గిస్తాయా? అని ప్ర‌శ్నిస్తే.. ఆ ఛాన్సే లేద‌నే అభిప్రాయాలు దేశ‌వ్యాప్తంగా వ్య‌క్త‌మౌతున్నాయి. ఉగ్ర‌వాదంపై పోరు అనేది ఎన్నిక‌ల్లో ఓ అంశం మాత్ర‌మేన‌ని, దేశీయంగా నెల‌కొన్న అనేక స‌మ‌స్య‌లు ఓట‌ర్ల‌పై ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని స్ప‌ష్ట‌మైంది. ఇండియా టుడే నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో ఈ విష‌యం తేట‌తెల్ల‌మైంది. ఈ నెల 5,6,7 తేదీల్లో 24 రాష్ట్రాల్లో 10,428 మంది ప్ర‌జ‌ల‌తో టెలిఫోన్ ద్వారా ఇండియా టుడే ఈ స‌ర్వేను నిర్వ‌హించింది.

ఉపాధి అవ‌కాశాలే కావాలి..

యువ‌త‌కు ఉపాధిని క‌ల్పించే అంశాలే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని ఈ స‌ర్వేలో తేలింది. ఉగ్ర‌వాదంపై పోరును అడ్డు పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌నుకుంటే అది ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మే అవుతుందని వెల్ల‌డైంది. ఉగ్ర‌వాదంపై కేంద్ర‌ప్ర‌భుత్వం సాగిస్తోన్న‌పోరును కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ అంద‌రూ స‌మ‌ర్థిస్తున్నారు. బీజేపీకి అండ‌గా నిలుస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ- త‌మ‌కు మెరుగైన ఉపాధి అవ‌కాశాల‌ను చూపించ‌గ‌లిగే రాజ‌కీయ పార్టీల‌కే అంద‌లం ఎక్కిస్తామ‌ని యువ‌త చెబుతోంది.

నిరుద్యోగ స‌మ‌స్య ఉగ్ర‌వాదం కంటే భ‌యంక‌ర‌మైన‌దనే అభిప్రాయాలు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఉపాధి అనే అంశ‌మే వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అత్యంత కీల‌కంగా మారుతుంద‌ని అంటున్నారు. ఇలా అభిప్రాయ‌ప‌డుతున్న వారి సంఖ్య 36 శాతం. ఉగ్ర‌వాదంపై పోరాటం బీజేపీని మ‌రోసారి అంద‌లం ఎక్కిస్తుంద‌ని భావిస్తోన్న వారి శాతం 23. సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) ఇటీవ‌లే విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం.. దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య భారీగా పెరిగింది. 2018 ఫిబ్ర‌వ‌రి నాటితో పోల్చుకుంటే 2019 ఫిబ్ర‌వ‌రి నాటికి 7.2 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. అదే 2016 సెప్టెంబ‌ర్ నాటి గ‌ణాంకాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే నిరుద్యోగ పెరుగుద‌ల 5.9 శాతం.

రైతులు, రైతాంగ స‌మ‌స్య‌లు కూడా కీల‌క‌మే..

దేశ‌వ్యాప్తంగా రైతులు, వ్య‌వ‌సాయ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పెను ప్ర‌భావం చూపుతాయ‌ని ఈ స‌ర్వే స్ప‌ష్టం చేస్తోంది. రైతాంగ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే పార్టీకి ఓటు వేస్తామంటూ 22 శాతం మంది ప్ర‌జ‌లు చెబుతున్నారు. న‌గ‌దు బ‌దిలీ వంటి కంటితుడుపు చ‌ర్య‌లు కాకుండా.. శాశ్వ‌త ప‌రిష్కారాన్ని చూపాల‌ని వారు కోరుకుంటున్నారు. కోట్లాది మంది రైతుల‌కు ముడిప‌డి ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో ప‌ని చేయ‌లేద‌ని అంటున్నారు. అన్నం పెట్టే రైతుల‌ను రాజ‌కీయ నాయ‌కులు ఓటుబ్యాంకుగా భావిస్తున్నారని 22 శాతం మంది ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అవినీతి, ధ‌ర‌ల పెరుగుద‌ల పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌న‌ట్టే

దేశంలో పాతుకుపోయిన అవినీతి అంశం ఈ ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోవ‌చ్చ‌ట‌. అన్ని పార్టీల్లోనూ అవినీతి ఉంద‌ని, రాజ‌కీయ నాయ‌కుల్లో 95 శాతం మంది అవినీతిప‌రులు ఉన్నార‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో అవినీతి అంశం ఓటుబ్యాంకును ప్ర‌భావితం చేస్తుందని 12 శాతం మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, నిత్యావ‌స‌ర స‌రుకులు స‌హా అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల విష‌యం రాజ‌కీయ పార్టీల గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని చెబుతున్న వారి శాతం ఏడు మాత్ర‌మే.

Jobs bigger issue than terror for Indians, finds PSE poll

బాలాకోట్ ఉగ్ర‌వాద దాడులు విజ‌య‌వంతం..

పుల్వామా ఘ‌ట‌న త‌రువాత భార‌త వైమానిక ద‌ళం పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్ర‌వాద శిబిరాల‌పై చేసిన దాడులు విజ‌య‌వంతం అయ్యాయ‌ని మెజారిటీ ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బాలాకోట్ దాడులు విజ‌య‌వంతం అయ్యాయ‌ని 94 శాతం మంది ప్ర‌జ‌లు భావిస్తున్నారు.
ఉగ్ర‌వాదాన్ని అణ‌చివేసే విష‌యంలో పాక్ స‌మ‌ర్థ‌వంతంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని చెబుతున్నారు. పుల్వామా ఘ‌ట‌న‌తో ఇది మ‌రోసార బ‌హిర్గ‌త‌మైంద‌ని అంటున్నారు. ఆ దాడులు నామ‌మాత్ర‌మేన‌ని మూడుశాతం మంది ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతుండ‌గా.. ఇది త‌మకు తెలియ‌ని విష‌య‌మ‌ని మిగిలిన మూడుశాతం మంది వెల్ల‌డించారు.

జైషె ఉగ్ర‌వాదుల శిబిరాల ధ్వంసంలో భిన్నాభిప్రాయాలు

బాలాకోట్ వైమానిక దాడులు విజ‌య‌వంతం అయ్యాయ‌ని చెబుతున్న వారిలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఈ దాడుల్లో జైషె మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్టు 66 శాతం మంది అభిప్రాయ‌ప‌డుతుండ‌గా.. దీనిపై నిర్ధార‌ణ‌కు రాలేమ‌ని చెబుతున్న వారి శాతం 26 శాతం. వైమానిక దాడులు విజ‌య‌వంతం అయిన‌ప్ప‌టికీ.. ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారా? లేదా? అనే అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక్క ఉగ్ర‌వాది కూడా హ‌తం కాలేద‌ని అంటోన్న వారి శాతం ఎనిమిదిగా న‌మోదైంది. బాలాకోట్ వైమానిక దాడులు బీజేపీ ఘ‌న‌తేన‌ని చెబుతున్న వారి శాతం 55 కాగా, 29 శాతం మంది ప్ర‌జ‌లు దీనిపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయ‌ట్లేదు.

అభినంద‌న్‌ను విడిపించిన క్రెడిట్ మోడీదే..

అలాగే- ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్లే పాకిస్తాన్ చెర‌లో చిక్కిన‌ వైమానిక ద‌ళ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ సుర‌క్షితంగా స్వ‌దేశానికి చేరుకున్నార‌ని 77 శాతం మంది ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఈ విష‌యంలో ఆరుశాతం మంది పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను స‌మ‌ర్థిస్తున్నారు. పొరుగు దేశాల ఒత్తిళ్ల వ‌ద్దే పాకిస్తాన్ అభినంద‌న్‌ను విడిచిపెట్టింద‌ని అంటోన్న వారి శాతం నాలుగు. ఈ విష‌యంలో తామేమీ వ్యాఖ్యానించ‌లేమ‌ని 13 శాతం మంది చెబుతున్నారు.

శాంతి చ‌ర్చ‌లు వ‌ద్దు..క్రికెట్ అస‌లే వ‌ద్దు

పాకిస్తాన్ తో శాంతి చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని, ఎన్నిసార్లు భేటీ అయినా ఆ దేశం త‌న వైఖ‌రిని మార్చుకోద‌ని 58 శాతం మంది అభిప్రాయ‌ప‌డుతుండ‌గా.. చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కారాన్ని అన్వేషించుకోవాల‌ని 18 శాతం చెబుతున్నారు. మిగిలిన 24 శాతం మంది దీన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. త‌మ‌కు తెలియ‌ద‌ని వ‌దిలేస్తున్నారు. పుల్వామా ఘ‌ట‌న అనంత‌రం పాకిస్తాన్ తో క్రికెట్ ఆడ‌కూడ‌ద‌ని 53 శాతం మంది శాసిస్తున్నారు. ఆ దేశంతో క్రికెట్ సంబంధాల‌ను కూడా తెంచుకోవాల‌ని చెబుతున్నారు. 37 శాతం మంది మాత్రం క్రికెట్ ద్వారా కూడా పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుప‌ర్చుకోవ‌చ్చ‌ని అంటున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ లో పాక్ తో క్రికెట్ ఆడ‌కూడ‌దంటూ అభిప్రాయ ప‌డిన వారి శాతం కింద‌టి వారం 70 శాతం మేర న‌మోదు కాగా.. అది 58 శాతానికి క్షీణించింది. క్రికెట్ స‌హా పాకిస్తాన్ తో ఎలాంటి దౌత్య‌ప‌ర‌మైన సంబంధాలు పెట్టుకోకూడ‌ద‌ని కింద‌టి నెల 28వ తేదీని వెలువ‌డిన స‌ర్వేలో 74 మంది త‌మ అభిప్రాయాల‌ను వెలిబుచ్చారు.

రాఫెల్ జెట్ ఫైట‌ర్ల‌లో జాప్యం పాపం యూపీఏదే..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌క ప్రచారాస్త్రంగా మారిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో యూపీఏ ప్ర‌భుత్వం జాప్యం చేసిందంటూ 51 శాతం మంది ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మోడీ స‌ర్కార్ వ‌ల్ల జాప్య‌మైంద‌ని 24 శాతం మంది ప్ర‌జ‌లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+