నిరుద్యోగుల నెత్తిన పిడుగులాంటి వార్త: ఉద్యోగాలు కష్టమే ఇక!..
గతేడాదితో పోల్చుకుంటే.. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉద్యోగవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
ముంబై: ఎంప్లాయిమెంట్ విషయంలో ఆయా కంపెనీల ఆలోచనా సరళి.. రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాల రూపకల్పనకు అవకాశం లేదని చెబుతోంది. ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది పిడుగు లాంటి వార్తే.
గతేడాదితో పోల్చుకుంటే.. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉద్యోగవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార రంగంలో నెలకొన్న అనిశ్చితి, నైపుణ్యం గల ఉద్యోగుల కొరత, పెరిగిన సాంకేతికత కారణంగా కొత్తగా ఉద్యోగాలు పుట్టుకురావడం కష్టమే అని చెబుతున్నారు.

ఇదే విషయమై మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే ఓ ఆసక్తికర రిపోర్టును తెరమీదకు తెచ్చింది. ఈ సంస్థ నిర్వహించిన క్యూ2 2017 సర్వేలో కేవలం 19శాతం మంది మాత్రమే తమ స్టాఫ్ ను పెంచుకోవాలని యోచిస్తున్నట్లుగా వెల్లడైంది. ఒక శాతం ఉద్యోగులు స్టాఫ్ ను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. ఇక 68శాతం మంది అసలు తమ ఎంప్లాయిమెంట్ లో ఎలాంటి మార్పులు చేయబోమని పేర్కొన్నారు.
మొత్తం మీద ఈ త్రైమాసికంలో ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ +18గానే ఉండబోతుందని సర్వే తెలిపింది. కాగా, 2017 జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ నికర ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ +21శాతంగా, 2016 ఏప్రిల్-జూన్ లో +38శాతంగా ఉంది. ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో కొంత స్థిరత్వం ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఆ ప్రక్రియ మందగిస్తుందని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ రావ్ కూడా తెలిపారు.
నివేదికలు చెబుతున్న దాని ప్రకారం.. ఏడు పారిశ్రామిక సెక్టార్లలో పని ఒత్తిడి పెరగనున్నట్లు తెలుస్తోంది. సర్వీస్ సెక్టార్ లో ఉద్యోగాలు పెరుగుతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీని తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ సెక్టార్, రిటైల్ ట్రేడ్ సెక్టార్లలో ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ బాగుంటుందని,రవాణా రంగం ఢీలా పడిపోతుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications