జులైలో భారత్కు జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ తన సింగిల్ షాట్ కరోనా వ్యాక్సిన్ వచ్చే జూన్ లేదా జులైలో భారత్లో దిగుమతి అయ్యే అవకాశం ఉంది. అప్పటి ఫిల్ అండ్ ఫినిష్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు ఏఎన్ఐ తన కథనంలో వెల్లడించింది.
తుది దశలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్
వ్యాక్సిన్ తయారీలో ప్రక్రియలో ఫిల్ అండ్ ఫినిష్ అనేది చివరి ప్రక్రియ. ఇందులో వ్యాక్సిన్ ను వయల్స్ లేదా సిరంజీల్లో నింపుతారు. ఆ తర్వాత సీల్ చేసి షిప్పింగ్ కోసం ప్యాకేజ్ చేస్తారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్.. ఇటీవల పలు విదేశీ టీకాలకు కూడా ఆమోదం తెలిపింది. వెస్టెర్న్ కంట్రీస్, జపాన్ దేశాల నుంచి కరోనా వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఫైజర్ తోపాటు జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా షాట్స్ దిగుమతి చేసుకునేందుకు చర్యలు చేపడుతోంది. లోకల్ సేఫ్టీ ట్రయల్స్ నుంచి ఈ కంపెనీల వ్యాక్సిన్లకు మినహాయింపు లభించింది.
జూన్ లేదా జులైలో భారత్కు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్
ఏఎన్ఐ కథనం ప్రకారం.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు జూన్ లేదా జులై 2021 నాటికి భారతదేశంలో దిగుమతి అవుతాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం హైదరాబాద్ నగరంలోని బయోలాజికల్ ఈతో కలిసి జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పనిచేస్తోంది. బయోలాజికల్ ఈ ద్వారా జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు మనదేశంలోకి రానున్నాయి.
బీఈ సొంతంగా మరో వ్యాక్సిన్ను కూడా ఉత్పత్తి చేస్తోంది. ఆ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ అనుమతి కూడా లభించింది. దీంతో టీకాను త్వరలోనే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు బీఈ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నవంబర్ 2020లోనే బయోలాజికల్ ఈ తన కరోనా వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినియకల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ రెండు దశల్లోనూ ఆశించిన ఫలితాలను రాబట్టింది. ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టనుంది.
జాన్సన్ అండ్ జాన్సన్ టీకాపై నిషేధం ఎత్తివేత
కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన కరోనా టీకాపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, గత వారం రోజుల్లోనే ఇండియాలో 22.5 లక్షల కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో 89శాతం మరణాల రేటు పెరిగింది. ఇది ప్రపంచంలోనే చాలా తీవ్రమైన పరిస్థితి కావడం గమనార్హం. ఆదివారం కూడా 3.55 లక్షల కేసులు నమోదు కావడం, 2807 మరణాలు సంభవించడం గమనార్హం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇప్పటి వరకు ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదుకాలేదు.