నక్సల్స్లో చేరండి, కాల్చి పారేస్తాం: వైద్యులపై కేంద్ర మంత్రి
ముంబై: సీనియర్ వైద్యులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కార్యక్రమానికి గైర్హాజరైన సీనియర్ వైద్యులపై ఆయన ఒంటికాలి మీద లేచారు. ఆదివారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే వారు నక్సలైట్లలో చేరాలని, ప్రభుత్వం వారిని కాల్చి పారేస్తుందని ఆయన అన్నారు. తన నియోజకవర్గం తూర్పు మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఆయన జెనరిక్ మెడిసిన్స్ 24x7 స్టోర్ను ఆయన ప్రారంభించారు.
మేయర్ వచ్చారు, డిప్యూటీ మేయర్ వచ్చారు, వారిని రాకుండా నిలిపిందెవరని ఆయన నిలదీశారు. నక్సలైట్లు ఏం చేస్తారు, వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, అందువల్ల వారు నక్సల్స్లో చేరాలని, ఇక్కడెందుకున్నరని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన మంత్రి ఇక్కడికి వస్తే వైద్యులు సెలవుపై వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. చంద్రాపూర్లో నక్సలైట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.