ఈ నెల 28, 29 దేశ వ్యాప్త సమ్మె - కార్మిక సంఘాల నిర్ణయం : బ్యాంకింగ్ సేవలపైనా..!!
ఈ నెల 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహించనున్నట్లుగా కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి. కొంత కాలగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1కి తగ్గించటాన్ని కార్మిక సంఘాల ఐక్య ఫోరం తప్పుబట్టింది. ప్రభుత్వ ఆస్తులను మానటైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమావేశం ఖండించింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్కు చెందిన ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కానున్నారని తెలిపింది.
పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, సీఎన్జీ ధరలను అమాంతం పెంచటాన్ని ఫోరం వ్యతిరేకించింది. ఈ ఫోరంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ భాగస్వాములుగా ఉన్నాయి. కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్కమ్ ట్యాక్స్, కాపర్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ ఇలా ఆయా రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చాయని పేర్కొంది. రాష్ట్ర స్థాయిలోని వివిధ యూనియన్లు కూడా కలిసి రావాలని ఫోరం కోరింది. రైల్వే, బ్యాకింగ్ యూనియన్లు సైతం సమ్మెకు మద్దతుగా ముందుకు వచ్చాయి. దీంతో.. బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది.
దేశ వ్యాప్తంగా ఈ నెల 28, 29న సమ్మె కారణంగా బ్యాంకింగ్ రంగ సేవలకు అంతరాయం ఏర్పాడే అవకాశం ఉందని పేర్కింది. ఈ నెలఖరుతో ఆర్దిక సంవత్సరం ముగింపు వేళ..సమ్మెకు వెళ్లటం ద్వారా బ్యాంకింగ కార్యకలాపాల పైన ప్రభావం పడుడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..బ్యాకింగ్ సేవలను సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. సమ్మె వాయిదా వేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దేశ వ్యాప్తంగా ఈ రెండు రోజుల సమ్మెకు మాత్రం కార్మిక సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. మార్చి 31న ఇయర్ ఎండింగ్ ఎకౌంట్స్ క్లోజ్.. ఏప్రిల్ 1న కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభ రోజు కావటంతో మొత్తంగా ఈ సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవల పైనే ఎక్కువగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.