ఉగ్రవాదంపై పోరు: నవంబర్లో భారత్ రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు కొన్ని గంటల ముందే ఇంద్ర 2018 పేరుతో భారత్ రష్యా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొనాలో వారి వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలనేదానిపై ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో బాబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది భారత ఆర్మీ. ఈ సైనిక విన్యాసాలు నవంబర్ 18 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇంద్ర 2018 పేరుతో భారత్ రష్యాలు సైనిక విన్యాసాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు రష్యా అధికారులు ధృవీకరించారు. నవంబర్ 18 నుంచి పదిరోజుల పాటు ఈ సంయుక్త సైనిక విన్యాసాలు ఉంటాయని తెలిపారు. ఇందుకోసం ఉత్తర్ప్రదేశ్ను ఎంచుకున్నట్లు వారు వెల్లడించారు.
ఇది ప్రతిసారి ఇరు దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలే. రష్యా 250 మందిని తమ సైన్యం నుంచి భారత్కు పంపనుంది. 2003 నుంచి రష్యా భారత్ల మధ్య ఇంద్ర పేరుతో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. గతేడాది రష్యాలోని తూర్పు ప్రాంతమైన ప్రిమోరీలో ఇరుదేశాల మధ్య సంయుక్త మిలటరీ డ్రిల్ జరిగింది.