ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు వీరే
Recommended Video

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. విధినిర్వహణలో ఉన్న పలువురు జర్నలిస్టులు గతంలో ఇదే తరహలో హత్యకు గురైన ఘటనలు అనేకం చోటుచేసుకొన్నాయి.
2016, మే 13న బీహార్లోని 'హిందీ దైనిక్ హిందుస్థాన్'కు చెందిన జర్నలిస్టు రాజ్దేవ్రంజన్ను తుపాకీతో కాల్చి అంతమొందించారు. ఆఫీసు నుంచి తిరిగివస్తున్న రాజ్దేవ్ను అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.
2015 మేలో మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం కవర్చేస్తున్న 'ఆజ్తక్' ప్రత్యేక ప్రతినిధి అక్షయ్సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. దీనికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ వెల్లడికాలేదు. ఈ కుంభకోణానికి సంబంధం ఉన్న పలువురు అనుమానాస్పదస్థితిలో మరణించారు.
2015 జూన్లో మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో విలేకరి సందీప్ కొఠారీని సజీవ దహనం చేశారు. మహారాష్ట్రలోని వార్థా సమీపంలో గల ఒక పొలంలో సందీప్ మృతదేహం లభ్యమైంది. అదే ఏడాది ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో విలేకరి జోగేంద్ర సిన్హాను సజీవ దహనం చేశారు. ఫేస్బుక్లో జోగేంద్ర.. ఆ రాష్ట్ర మంత్రి రామమూర్తికి వ్యతిరేకంగా పోస్టు పెట్టడంతోనే ఈ ఘాతుకం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.
2013లో యూపీలోని ముజఫ్పర్నగర్లో 'నెట్వర్క్ 18'కు చెందిన విలేకరి రాజేష్ వర్మను తుపాకీతో కాల్చి చంపేశారు..2014లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ఎంవీఎన్ శంకర్ హత్యకు గురయ్యారు. ఎంవీఎన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆయిల్ మాఫియాపై పలు కథనాలు అందించారు.
2014 మే 27న ఒడిశాలోని స్థానిక టీవీ ఛానల్ స్ట్రింగర్ తరుణ్కుమార్ను అత్యంత దారుణంగా హత్య చేశారు .'హిందీ దైనిక్ దీనబంధు' విలేకరి సాయి రెడ్డి.. ఛత్తీస్ఘడ్లోని నక్సల్ ప్రభావిత జిల్లా బీజాపూర్లో అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు.
మహారాష్ట్రకు చెందిన సంపాదకుడు నరేంద్ర దబోల్కర్ను 2013 ఆగస్టులో ఒక ఆలయం వెలుపల ఆగంతకులు తుపాకీతో కాల్చి హత్యచేశారు.'మిడ్ డే'కు చెందిన ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయి డేను 2011లో హత్య చేశారు.

అండర్ వరల్డ్ సంబంధిత సమాచారం ఉందని జ్యోతిర్మయి డేని హత్య చేశారని ప్రచారంలో ఉంది. 'డేరా సచ్చాసౌదా' చీఫ్ గుర్మీత్ రామ్రహీంకు వ్యతిరేకంగా గళం వినిపించిన విలేకరి రామచంద్ర చత్రపతిని సిర్సాలో హత్య చేశారు. 2002లో అతని కార్యాలయంలోకి చొరబడిన ఆగంతకులు తుపాకీతో కాల్చి అతన్నిహత్య చేశారు.












Click it and Unblock the Notifications