లేట్ అయినా లేటెస్ట్గా: రూ.100 క్లబ్లో ఢిల్లీ, కోల్కత: నార్త్ కూడా పరిపూర్ణ దశకు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి వాహనదారులపై భారాన్ని మోపాయి. తాజాగా చోటు చేసుకున్న పెంపుదలతో దేశ రాజధానిలో కూడా పెట్రోల్ రేటు 100 రూపాయల ల్యాండ్మార్క్ను దాటేసింది. కోల్కతలోనూ ఇదే పరిస్థితి. అక్కడా పెట్రోల్ రేటు వంద రూపాయలకు పైగా చేరింది. దేశంలో ఇప్పటిదాకా ఈ రెండు మెట్రో సిటీలు మాత్రమే వంద రూపాయల క్లబ్లో చేరలేదు. ఇక ఆ కొరత కూడా పూర్తయింది. లేట్గా అయినా లేటెస్ట్గా ఢిల్లీ, కోల్కతల్లో పెట్రోలు రేటు వంద రూపాయలు దాటింది.
రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. శ్రీగంగానగర్లో పెట్రోల్ ఈ మార్క్ను దాటేసింది కూడా. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్పై 39 పైసలు, డీజిల్పై 21 పైసల మేర పెంపుదల కనిపించింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.100.21 పైసలకు చేరింది. డీజిల్ 89.53 పైసలుగా నమోదైంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 106 రూపాయలను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.106.25 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర 97.09. చెన్నైలో పెట్రోల్ రూ.101.06, డీజిల్ ధర రూ.94.06 పైసలుగా నమోదైంది. తాజా పెంపుతో కోల్కతలో పెట్రోల్ ధర రూ.100.23 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.92.50గా ఉంటోంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.103.56, డీజిల్ రూ.94.89 పైసలు, హైదరాబాద్లో పెట్రోల్ రూ.104.14, డీజిల్ రూ.97.58 పైసలు పలుకుతోంది.
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో పెట్రోల్ ధర 111 రూపాయలను దాటేసింది. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.111.50 పైసలు. డీజిల్ కూడా అక్కడే హయ్యెస్ట్ రికార్డ్. లీటర్ డీజిల్ రూ. 102.78 పైసలకు చేరింది. భోపాల్లో పెట్రోల్ రూ.108.52 పైసలు, డీజిల్ రూ.98.30 పైసలుగా రికార్డయింది. పాట్నాలో పెట్రోల్ రూ.102.40 పైసలు, డీజిల్ రూ.94.99, లక్నోలో పెట్రోల్ రూ.97.33 పైసలు, డీజిల్ రూ.89.92 పైసలకు చేరింది. లక్నో వంటి ఒకట్రెండు నగరాలు మినహా దాదాపు అన్నీ వంద రూపాయలకు పైగా చేరాయి.












Click it and Unblock the Notifications