ఢిల్లీ గ్యాంగ్ రేప్: నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు
నిర్భయ కేసులో ఈ రోజు కోర్టు తీర్పు నేపథ్యంలో దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. సాకేత్ కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కోర్టు వద్దకు చేరుకున్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినప్పుడు, దానిని ఆందోళనకారులు స్వాగతించారు. అయితే, దోషులను త్వరగా ఉరి తీయాలని పలువురు డిమాండ్ చేశారు. తీర్పును నిర్భయ తండ్రి స్వాగతించారు.
గతేడాది డిసెంబర్ 16వ తేదిన ఢిల్లీలో నిర్భయపై దోషులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెనుదారుణంగా హింసించారు. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. నిర్భయ సామూహిక అత్యాచారం అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అందరు తీవ్రంగా ఖండించారు. వారిని ఉరితీయాలని డిమాండ్లు వినిపించాయి.
ఈ కేసులో ఆరుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఈ ఏడాది మార్చి 11న తీహార్ జైలుల ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష విధించింది. మిగిలిన నలుగురిని సాకేత్ కోర్టు నాలుగు రోజుల క్రితం దోషులుగా నిర్ధారించింది. ఈ రోజు ఉరి శిక్ష తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణ తొమ్మిది నెలలు సాగింది.
రాజకీయ ప్రభావిత తీర్పు
ఇది రాజకీయ ప్రభావితమైన తీర్పు అని దోషుల తరఫు న్యాయవాది చెప్పారు. తాము ఈ తీర్పు పైన పైకోర్టులో అప్పీల్ చేసుకుంటామన్నారు. నిర్భయ అత్యాచారం అనంతరం జరిగిన రేప్ ల పైన ఎందుకు ఇంత ఆసక్తి లేదని ప్రశ్నించారు. ఈ తీర్పు తర్వాత రెండు నెలల్లోపు అత్యాచార ఘటనలు జరగకుంటే తాము అప్పీల్కు కూడా వెళ్లమన్నారు.