చేతి వాసన పోలేదు: తన పాత పార్టీకి ఓటేయాలంటూ జ్యోతిరాదిత్య సిందియా
భోపాల్: రాజకీయ నేతలకు ఓ పార్టీ నుంచి ఓ పార్టీలోకి జంప్ చేయడం సాధారణమే. అయితే, పాత పార్టీ వాసన పోవాలంటే మాత్రం ఆ నాయకులకు కొంత సమయం పడుతుంది. చేరినవెంటనే ఆ పార్టీకి జైకొట్టాలన్నా.. సమయానికి మాత్రం పాత పార్టీనే గుర్తుకువస్తుంది. దీంతో ఆ పార్టీకే జైకొడటారు. వారి వ్యవహారానికి తాజా పార్టీ కార్యకర్తలు నిశ్చేష్టులవుతారు. ఇది సాధారణంగా ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం.
Recommended Video
సిందియా రాకతో బీజేపీ ప్రభుత్వం..
తాజాగా, భారతీయ జనతా పార్టీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా కూడా ఇలానే చేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన సింథియా.. తన అనుచరులైన 22 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయి.. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరింది. అయితే, అప్పుడు సింథియాతోపాటు 22 మంది ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 28 స్థానాలకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.
హస్తానికి ఓటేయాలంటూ..
ఈ క్రమంలో శనివారం సాయంత్రం గ్వాలియర్లోని దబ్రా టౌన్లో బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సింథియా పాల్గొన్నారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతుగా అందరూ బీజేపీకి గుర్తు కమలానికి ఓటు వేయాలని కోరాల్సింది పోయి.. పొరపాటున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. దీంతో ఆయన పక్కనే ఉన్న నేతలు అప్రమత్తం చేయడంతో వెంటనే సర్దుకుని కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు జ్యోతిరాదిత్య సింథియా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ సెటైర్.. బీజేపీ హితవు
ఈ వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేసింది. ‘మీరు చెప్పినట్లు మధ్యప్రదేశ్ ప్రజలు హస్తానికే ఓటేస్తారు సింధియాజీ' అంటూ పేర్కొంది. అయితే, జరిగిన పొరపాటును వక్రీకరించడం సరికాదని బీజేపీ హితవు పలికింది. ఇలాంటి పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయని బీజేపీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది వ్యాఖ్యానించారు. కాగా, ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓ వైపు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తుండగా.. మరోవైపు సిందియా కూడా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.