అసెంబ్లీలో అమ్మాయిల ఫోటోలు చూస్తూ దొరికిన ఎమ్మెల్యే
ప్రజల దేవాలయం అసెంబ్లీలో శృంగార చిత్రాలను చూస్తూ 2012లో అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు కర్నాటక మంత్రుల ఘటన మరవకముందే అదే కర్నాటక రాష్ట్ర అసెంబ్లీలో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే సభ జరుగుతుండగా అమ్మాయిల ఫోటోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కారు. వివరాల్లోకి వెళితే బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మహేష్ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సభలో చర్చలో పాల్గొనకుండా తన మొబైల్ ఫోన్ చూస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఆ సమయంలో తాను అమ్మాయిల ఫోటోలను చూస్తూ ఉన్నారు.
సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం తనకు తెలియడంతో మహేష్ మీడియా ముందు వివరణ ఇచ్చారు. తను సభలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం తప్పేనని చెప్పారు. అయితే ఈ విషయాన్ని మీడియా ఎందుకు రాద్దాంతం చేస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అసలు తన పరువు తీయడం వల్ల మీడియాకు ఏం లబ్ధి చేకూరుతుందని ప్రశ్నించారు. తను అమ్మాయిల బొమ్మలను మొబైల్ ఫోన్లో చూసిన మాట వాస్తవమే అని వివరణ ఇచ్చిన మహేష్... ఒక తండ్రిగా తన కొడుకు కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే అమ్మాయిల ఫోటోలను మొబైల్ ఫోన్లో చూశానే తప్ప మీడియా వక్రీకరించి వార్తలు ప్రసారం చేస్తున్న ఉద్దేశంతో కాదని మహేష్ వివరించారు. ఒకరిపై వార్త ప్రసారం చేసేముందు నిజనిజాలు తెలుసుకుని టెలికాస్ట్ చేయాలని సూచించారు. ప్రజల ముందు పోయిన తన పరువును తిరిగి తీసుకురాగలరా అంటూ మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2012లో కర్నాటకలో నాటి బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన లక్ష్మణ్ సావ్డీ, సీసీ పాటిల్లు నిండు సభలో తమ మొబైల్ ఫోన్లలో నీలిచిత్రాలు చూస్తూ దొరికిపోయారు. బీజాపూర్ జిల్లాలో పాకిస్తాన్ జెండా ఎగురవేసిన అంశంపై సభ అట్టుడికిపోతున్న సమయంలో ఈ మంత్రులు తాపీగా కూర్చుని నీలిచిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనిపై పెద్దఎత్తున నాడు బీజేపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. సాయంత్రం సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న న్యూస్ ఛానెళ్లు నీలిచిత్రాలు చూస్తున్న దృశ్యాలను టెలికాస్ట్ చేశాయి. వెంటనే మంత్రులు రాజీనామా చేయాల్సిందిగా నాటి ప్రతిపక్ష నేత సిద్దరామయ్య డిమాండ్ చేశారు.