టిప్పు జయంతిలో మంత్రి‘పొర్న్’చూడలేదు: సీఐడీ
బెంగళూరు: నవంబర్ 10వ తేదీన రాయచూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ జయంతి సందర్బంగా ప్రాధమిక, మాధ్యమిక విద్యాశాఖా మంత్రి తన్వీర్ సేఠ్ నీలి చిత్రాలు చూడలేదని సీఐడీ సైబర్ విభాగం అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు.
సీఐడీ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసిన నివేదికను శుక్రవారం బెలగావిలోని సువర్ణ విధాన సౌధలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నివేదికలో మంత్రి తన్వీర్ సేఠ్ కు నీలి చిత్రాల ఫోటోలు చూసే ఉద్దేశం లేదని అధికారులు దృవీకరించారు.
మంత్రి తన్వీర్ సేఠ్ మొబైల్ కు అర్దనగ్న చిత్రాలు ఉన్న పోటోలు వాట్సాప్ లో వచ్చాయని, వాటిని స్క్రోల్ చేస్తున్న సమయంలో మంత్రి ఆ ఫోటోలు చూడవలసి వచ్చిందని అన్నారు. వాట్సాప్ గ్రూప్ లో అర్దనగ్న చిత్రాలు పంపించిన వ్యక్తిని సీఐడీ అధికారులు విచారించారు.
వాట్సాప్ గ్రూప్ లో ఇలాంటి అర్దనగ్న ఫోటోలు ఇంతకు ముందు వచ్చాయని ఆ వ్యక్తి విచారణలో అంగీకరించాడని సీఐడీ అధికారులు చెప్పారు. మంత్రి తన్వీర్ సేఠ్ స్నేహితుల ఫోటోలు షేర్ చేసుకోవడం కోసం వాట్సాప్ గ్రూప్ ఆక్టివేట్ చేసుకున్నారని సీఐడీ అధికారులు చెప్పారు.
అంతే కానీ ఇలాంటి అశ్లీల ఫోటోలు చూడటానికి మంత్రి వాట్సాప్ గ్రూప్ లో లేరని తమ విచారణలో వెలుగు చూసిందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు మాత్రం మంత్రి తన్వీర్ సేఠ్ తప్పు చేశారు అని ఇప్పటికీ మండిపడుతున్నాయి.