లోకనాయకుడికి బంపర్ ఆఫర్
DMK Rajya Sabha candidates: తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. సల్మా, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎస్ ఆర్ శివలింగం.. ఈ జాబితాలో ఉన్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సారథ్యాన్ని వహిస్తోన్న మక్కల్ నీథి మయ్యం (MNM) పార్టీకీ ఓ సీటును రిజర్వ్ చేసింది. ఎంఎన్ఎం నుంచి కమల్ హాజన్.. పెద్దల సభలో అడుగు పెట్టనున్నారు.
తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనితో పాటు అస్సాంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే షెడ్యూల్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం ఎనిమిది రాజ్యసభ సీట్ల కోసం జూన్ 19వ తేదీన పోలింగ్ ను నిర్వహించాల్సి ఉంది.

పీఎంకే- అన్బుమణి రామదాస్, ఏఐఏడీఎంకే- ఎన్ చంద్రశేఖరన్, డీఎంకే- ఎం షణ్ముగం, సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్, ఎంఎం అబ్దుల్లా, ఎండీఎంకే- వైగో సభ్యత్వ కాలం జులైలో ముగియబోతోంది. అస్సాంకు సంబంధించి.. భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు- బీరేంద్ర ప్రసాద్ భైష్య, మిషన్ రంజన్ దాస్ మాజీలు కానున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఎన్నికలు అవసరం అయ్యాయి. ఈ ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2వ తేదీన విడుదల అవుతుంది. అదే నెల 9వ తేదీన నామినేషన్ పర్వం ఆరంభమౌతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈసీ నిర్దేశించిన చివరి తేదీ.. 12. 19వ తేదీన పోలింగ్ ఉంటుంది.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు మొత్తం నాలుగు స్థానాలు దక్కనున్నాయి. ఇందులో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఆ పార్టీ. ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి జఖియా అలియాస్ రాజాత్తి సహా మరో ఇద్దరిని ఎంపిక చేసింది డీఎంకే. సల్మా ఆమె పెన్ నేమ్.
ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీనియర్ అడ్వొకేట్ పీ విల్సన్ ను ఈ దఫా కూడా కొనసాగించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆయన పేరును పొందుపరిచింది. సేలం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు శివలింగం పేరును ఖరారు చేసింది డీఎంకే అగ్ర నాయకత్వం.
మరో సీటును మిత్ర పార్టీ మక్కల్ నీథి మయ్యంకు కేటాయించింది. దీనితో- ఆ పార్టీ అధినేత కమల్ హాసన్.. రాజ్యసభకు ఎన్నికకానున్నారు. ఈ మేరకు ఇదివరకే ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎం.












Click it and Unblock the Notifications