సినిమాలకు గుడ్ బై: పవన్ తర్వాత కమల్ సంచలనం, ‘నటుడిగా చనిపోను’
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను ఇకపై సినిమాలు చేయబోనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాను చేస్తున్న రెండు సినిమాలే తన చివరి సినిమాలని అన్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించనని కమల్ హాసన్ స్పష్టం చేశారు. కమల్ హాసన్ నిర్ణయంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆ 2సినిమాలు మాత్రం
ప్రస్తుతం బోస్టన్లో ఉన్న కమల్.. అక్కడ ఓ ప్రైవేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు సినిమాలు మాత్రం యథావిధిగా ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలిపారు. ఈ(ఫిబ్రవరి) నెలలోనే తన పార్టీ పేరును, విధివిధానాలను వెల్లడిస్తానని తెలిపారు.
నటుడిగా చనిపోవడం ఇష్టం లేదు
‘త్వరలో రాబోతున్న రెండు సినిమాల తర్వాత నేను సినిమాలు చేయను. నేను నటుడిగా చనిపోవడానికి ఇష్టపడటం లేదు. ప్రజాసేవ చేసిన తర్వాతే తుది శ్వాస విడుస్తా. అందుకే పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను' అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
నాతో 37లక్షల మంది..
‘ప్రజలు నిజాయితీగా బతికేందుకు ఎదో ఒకటి చేయాలని భావిస్తున్నాను. 37 ఏళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఈ 37 సంవత్సరాలలో దాదాపు పది లక్షల మంది నిజాయితీపరులైన పనిమంతులను కలుసుకున్నాను. గత 37 ఏళ్లుగా వారు నాతోనే ఉన్నారు' అని కమల్ వివరించారు.
బ్యాంకులో డబ్బులు వేసుకోడానికి కాదు
‘నా బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి రావాలని పదేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నా' అని కమల్ వెల్లడించారు.
పవన్ తర్వాత కమలే..
కాగా, ఇటీవల ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాను సినిమాలు చేయనని ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయి సమయం రాజకీయాలకు కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, పవన్ 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాలు చేస్తారని అభిమానులంటుండటం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు.