కావేరీ జలాలే కీలకాంశం: కర్ణాటక సీఎం కుమారస్వామిని కలిసిన కమల్, ఏమన్నారంటే.?
బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్.. సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య నడుస్తున్న కావేరీనదీ జలాల వివాదంపై వీరిద్దరూ చర్చించారు.
తమిళనాడులో ప్రస్తుతం కావేరీ జలాల కోసం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టత తీసుకురావడానికి కుమారస్వామితో కమల్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం కమల్ మీడియాతో మాట్లాడారు.
'కావేరీ జలాలను తమిళనాడు-కర్ణాటక ఇద్దరూ పంచుకోవాలి. ఇందులో మరో దారి లేదు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో భేటీ అయ్యాను. సమస్యపై స్పందించాల్సిందిగా ఆయనను కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు. నిజానికి కుమారస్వామి కూడా సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రిగా ఆయనా ప్రయత్నాలు చేస్తున్నారు. మా భేటీలో రాజకీయ కోణం ఎంతమాత్రం లేదు. కావేరీ విషయం గురించే మాట్లాడటానికి ఇక్కడకు వచ్చాను' అని కమల్ తెలిపారు.

'కావేరీ వివాదం విషయమై తమిళనాడులో నిరసనలు ఎక్కువయ్యాయి. అవన్నీ మరింత హింసాత్మకంగా మారక ముందే ఇరు రాష్ట్రాలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయనను కోరాను. ఇందుకు కుమార స్వామి సానుకూలంగా స్పందించారు' అని కమల్ వెల్లడించారు.
'తమిళనాడులో జరిగే ఆందోళనలను నేను తప్పు పట్టడం లేదు. అవి హింసాత్మకంగా ఉండకూడదని కోరుకుంటున్నా. స్టెరిలైట్ విషాదం నుంచి ఇంకా తమిళనాడు ప్రజలు కోలుకోలేదు. కావేరీ జలాల కోసం నిరసనలు వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు. వివాదం ఓ కొలిక్కి వచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ, అవి హింసతో కూడుకున్నవి కాకూడదు. గాంధీ మార్గంలో శాంతియుత ఉద్యమం చేస్తే మనకు మంచి ఫలితం దక్కుతుంది' అని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications