కమల్ హాసన్ పార్టీకి ఆసక్తికరమైన ఎన్నికల గుర్తు: దేశ రాజకీయాలకు సరైన దారి చూపుతుందట:
న్యూఢిల్లీ: బహుభాషా నటుడు కమల్ హాసన్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీకి ఆసక్తికరమైన గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ గుర్తు కేటాయించడం పట్ల కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలకు, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా సరైన గుర్తు వచ్చిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే- టార్చిలైట్. విద్యుత్ తో కాకుండా- బ్యాటరీల ద్వారా పనిచేసే టార్చిలైట్ గుర్తును ఎన్నికల సంఘం మంజూరు చేసింది.
కమల్ హాసన్ గత ఏడాది మక్కళ్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సమాయాత్తమౌతున్నారు కూడా. గ్రామీణులు, ప్రత్యేకించి- రైతాంగానికి తనవంతు సహాయ, సహకారాలను అందించే టార్చిలైట్ గుర్తు తమకు దక్కడం పట్ల ఆనందంగా ఉందని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. దారి తప్పిన దేశ రాజకీయాలకు సరైన మార్గంలో నడిపించాలనే తమ సిద్ధాంతమని ఆయన అన్నారు. టార్చిలైట్ వెలుగులో దేశ రాజకీయాలను సరైన దారిలో పెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ఈ గుర్తును కేటాయించినందుకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

తామది కాషాయరంగు కాదని పార్టీని నెలకొల్పిన తొలి రోజుల్లోనే కమల్ హాసన్ ప్రకటించారు. దీనితో ఆయన కాంగ్రెస్ కు దగ్గరవుతారని భావించారు. కొద్దిరోజుల కిందటే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరితోనూ ఆయన సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. దీనితో కమల్ హాసన్ కు తలుపులు మూసుకున్నట్టు అయ్యాయి. దీనితో ఆయన వామపక్షాల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ మొదటి నుంచీ డీఎంకేను వ్యతిరేకిస్తున్నందున.. ఆ కూటమిలో చేరే ప్రసక్తే లేకపోవచ్చు.












Click it and Unblock the Notifications