దటీజ్ కమల్: నిజాయితీ చాటుకున్న విశ్వ నాయకుడు.. వసూలు చేసిన విరాళాలు వెనక్కి
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో పలు మార్పులు జరుగుతున్నాఅందరి దృష్టి ఇప్పుడు నటుడు కమల్హాసన్పైనే ఉంది.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో పలు మార్పులు జరుగుతున్నాఅందరి దృష్టి ఇప్పుడు నటుడు కమల్హాసన్పైనే ఉంది. రాష్ట్రంలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్హాసన్ సిద్ధం అయ్యారు. అయితే వారిద్దరి పరుగు పందెంలో రజనీ కంటే ముందే కమల్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రసంగాలు, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ద్వారా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు యువతను ఆకట్టుకుంటున్నాయి.
అంతేకాదు నిజాయితీగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించగానే కమల్ హసన్ అభిమానులు ప్రజల నుంచి విరాళాలు వసూలు చేయడంపై తమిళ మ్యాగజైన్ లో ఆర్టికల్ ప్రచురితం కావడంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇప్పటి వరకు రూ.30 కోట్లు విరాళాలు వసూలయ్యాయి. పార్టీ స్థాపించకముందే విరాళాల వసూళ్లు చట్ట విరుద్ధమని భావించిన కమల్.. వాటిని అభిమానులు, ప్రజలకు తిరిగి ఇచ్చేయనున్నట్లు ప్రకటించారు.

హిందు ఉగ్రవాదంపై వ్యాఖ్యలతో కష్టాలు
కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఆయన విమర్శలు గుప్పించారు. తమిళులకు మేలు చేయాలనేదే తన ధ్యేయమని చెబుతూ కమల్ ముందుకు సాగుతున్నారు. కాగా, ఆయన ‘ఆనంద వికటన్' మ్యాగజైన్లో హిందూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రారంభంలోనే కష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. ఒక న్యాయవాది క్లర్క్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు.. తక్షణం విశ్వ నాయకుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానన్న విశ్వ నాయకుడు
ఇటీవల చెన్నై నగరంలో తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మాట్లాడుతూరాజకీయ పార్టీ పెట్టనంత మాత్రాన తాను రాజకీయాల్లో లేనని చెప్పడంలో అర్థం లేదన్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు కూడా తెలిపారు. పార్టీ పేరును ఖరారు చేసే ముందు తాను ప్రజాభిప్రాయాలను సేకరిస్తానన్నారు. దీనికోసం ఓ మొబైల్ యాప్నూ ఆవిష్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు ఉంటానని ప్రకటించారు. తన అభిమానుల సంక్షేమ సంఘాలు కూడా ప్రజలను కలిసి ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత తన మద్దతుదారులు, అభిమానులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

కమల్ హసన్ సూచన మేరకు అభిమానులు ఏర్పాట్లు
ఆయన పర్యటనల తేదీల వివరాలు ప్రస్తుతానికి అధికారికంగా విడుదల కాకున్నా వచ్చే నెలాఖరులో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వనీయ వర్గాల కథనం. తాను ఏయే జిల్లాల్లో ఎప్పుడు పర్యటించాలి, అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి సంబంధించి ఆయన తన అభిమానుల ప్రతినిధులతో ఇప్పటికే చర్చించారు. ఈ విషయమై కమల్హాసన్ అభిమాన సంఘం సీనియర్ నిర్వాహకుడు ఒకరు మాట్లాడుతూ కొత్త పార్టీ ప్రారంభించే ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించాలనేది తమ నాయకుడి ఆలోచన అన్నారు. ఆ మేరకు తమతో సమావేశం అయ్యారని చెప్పారు. ప్రతి జిల్లా నుంచి అభిమానుల సంఘం ప్రతినిధులు దీనికి హాజరవుతున్నట్లు వివరించారు. డిసెంబర్ నెలాఖరులోగానీ, జనవరి ప్రారంభంలో గానీ ఆయన పర్యటన ప్రారంభమవుతుందన్నారు.

విజయన్ మొదల కేజ్రీ.. మమతాబెనర్జీలతో కమల్ ఇలా భేటీ
ఈ నేపథ్యంలో కమల్హాసన్ దేశ రాజకీయాల్లో ఆరితేరిన నేతలనూ కలిసి సలహాలు తీసుకుంటున్నారు. ఈ కోవలో ముందుగా ఆయన కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి చర్చించారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనతో మాట్లాడారు. తనదీ వామపక్ష భావజాలం అని చెప్పకనే చెప్పారు. పినరయి విజయన్ నుంచి పలు సలహాలు పొందారు. ఇటీవల చెన్నైకి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. విశ్వ నాయకుడు కమల్ హసన్తో భేటీ అయ్యారు. తర్వాత కమ్యూనిస్టులకు బద్ధ శత్రువైన తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతోనూ కోల్కతాలో ఆయన సమావేశమయ్యారు. ఇదే తరహాలో దేశంలోని మరికొంత మందిని కలిసే ఆలోచనలో ఆయన ఉన్నారని సమాచారం.

విశ్వ నాయకుడిపై కేసు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం
రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించిన సీనియర్ నటుడు కమల్ హాసన్ ‘హిందూ ఉగ్రవాద' కామెంట్లపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి తమకు వివరాలు అందజేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

కేసు ప్రతిని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అందజేయాలని ఇలా ఆదేశం
కమల్ హసన్ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని మొత్తం ఉగ్రవాదులుగా అభివర్ణించేలా ఉందని పేర్కొంటూ జీ దేవరాజన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళ జాతిని విడగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసి కుట్ర పూరితంగా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు. అదే సమయంలో కమల్ రాసిన వ్యాసాన్ని ప్రచురించిన మ్యాగజైన్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తక్షణమే ఆయపై కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ఆదేశాల ప్రతిని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అందజేయాలని ఆదేశిస్తూ కేసు వచ్చే వారానికి వాయిదా వేసింది.

తన వ్యాఖ్యల ఆంతర్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లు వ్యాఖ్య
‘ఆనంద వికటన్' మ్యాగజైన్ కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో హిందు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తమిళనాడుతోపాటు దేశంలోని ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని కమల్ హసన్ మండిపడిన విషయం తెలిసిందే. అయితే తిరిగి నవంబర్ 7న తన పుట్టినరోజు సందర్భంగా యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ తాను హిందువుల మనోభావాలను దెబ్బతీసే పని ఏనాడూ చెయ్యబోనని తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యల ఆంతర్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని నష్టనివారణ చర్యలకు దిగారు.












Click it and Unblock the Notifications