ఆ ఆలోచన దేశానికి ప్రమాదకరం: మోడీకి కమల్ వీడియో ట్వీట్
చెన్నై: కావేరీ మేనేజ్మెంట్ బోర్డు కోసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ వీడియోలో చేశారు.
ఈ ట్వీట్ వీడియోలో.. 'గౌరవనీయులైన ప్రధానమంత్రికి.. తమిళనాడు ప్రజలు న్యాయం కోసం పోరాడుతున్నారు. న్యాయం వచ్చింది కానీ, దానిని అమలు చేయడం లేదు. కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కావేరీ విషయంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని ప్రజలు భావిస్తున్నారు. ఆ ఆలోచన దేశానికి ప్రమాదకరం, అవమానకరం. ఇది మారుతుందని ఆశిస్తున్నాను' అని కమల్ పేర్కొన్నారు.
అంతేగాక, 'మీరు(మోడీ) గుజరాత్కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు నర్మద జలాలను నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచిన అనుభవం మీకు ఉంది. ఓ బాధ్యతగల ప్రధానమంత్రిగా మా తమిళనాడు ప్రజలకు కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటుచేసేలా చూడండి. మీ బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. కావేరీ జలాల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకూ సమానమైన నీటి వాటా దక్కాలి. ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీ కమల్హాసన్' అని తెలిపారు.
To my Honourable Prime Minister #KamalAppealToPM @narendramodi @PMOIndia pic.twitter.com/FXlM7dDO9x
— Kamal Haasan (@ikamalhaasan) April 12, 2018
కాగా, గురువారం తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో కావేరీ జలాల ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రంలో కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటుచేయాలని తమిళనాడు ప్రజలు, నేతలు, ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ, నల్ల బెలూన్లను ఎగురవేశారు. మోడీగోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
మరోపక్క కావేరీ వివాదం పరిష్కారమయ్యేవరకూ ఐపీఎల్ మ్యాచ్లు చెన్నైలో నిర్వహించకూడదని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్లను హైదరాబాద్ లేదా విశాఖపట్నం తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ.
కాగా, కావేరి ఆందోళనలపై ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా ఇప్పటికే స్పందించారు. తమిళుల ఆందోళనకు మద్దతు ఇవ్వాలని, ఐపీఎల్ మ్యాచ్లు ఆడేటప్పుడు చెన్నై జట్టు సభ్యులు, వీక్షకులు నలుపు రంగు బ్యాండ్లు కట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కావేరీ బోర్డు విషయమై సుప్రీం కోర్టు రెండ్రోజుల క్రితం.. ముసాయిదాను రూపొందించి మే 3 కల్లా తమకు అందివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.