మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్: రాహుల్ ట్వీట్కు జ్యోతిరాధిత్య సింధియా కౌంటర్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న మరో యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు ఢిల్లీ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కమల్ నాథ్, జ్యోతరాదిత్య సింధియా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇరువురితోను చాలాసేపు చర్చించారు. అనంతరం వారు భోపాల్ బయలుదేరారు. అప్పటికే కమల్ నాథ్ పేరును ఖరారు చేశారని తెలుస్తోంది.
కమల్ నాథ్ ఢిల్లీ నుంచి భోపాల్ బయలుదేరుతూ... నేను భోపాల్ వెళ్తున్నానని, ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు.
మరోవైపు, రాహుల్ గాంధీ చేసిన ట్వీట్కు జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు లియో టాల్స్టాయ్ కొటేషన్ 'సహనం, సమయం రెండు శక్తిమంతమైన ఆయుధాలు' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ పక్కన సింధియా, కమల్లు ఉన్నారు.
ఆ వెంటనే సింధియా కూడా ట్వీట్ చేశారు. ఇది రాహుల్ గాంధీని ఉద్దేశించి అని భావిస్తున్నారు. ఇది రేసు కాదని, కుర్చీ కోసం జరుగుతున్న రేసు కాదని, ఇక్కడ మేం ఉన్నది మధ్యప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకని, నేను భోపాల్ వెళ్తున్నానని పేర్కొన్నారు.