కన్నయ్యకి వెంకయ్య ఆఫర్!, పార్టీ మారిన సీఎం
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో జైలుపాలై, తాత్కాలిక బెయిల్ పైన విడుదలైన జెఎన్యు విద్యార్థి కన్నయ్య కుమార్ పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైలు నుంచి విడుదలైన కన్నయ్యకు బాగా పబ్లిసిటీ వచ్చిందని, ఇక ఆయన రాజకీయాల్లో చేరవచ్చునని సలహా ఇచ్చారు.
అయితే కన్నయ్యకు ఇష్టమైన పార్టీ ప్రస్తుత పార్లమెంటులో రెండంకెల స్థానాలను సైతం దక్కించుకోలేదని, అది సింగిల్ డిపాజిట్ కలిగి ఉందని చెప్పారు. తనకు వచ్చిన ప్రచారంతో ఓ రాజకీయ నాయకుడు కాగల అవకాశాన్ని కన్నయ్య పొందాడన్నారు.
జెఎన్యులో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్నయ్య కుమార్ అరెస్టైన విషయం తెలిసిందే. దాదాపు మూడు వారాల పాటు జైలులో గడిపిన కన్నయ్య గురువారం పైన బెయిల్ పైన విడుదలయ్యాడు.
పార్టీ మారిన అరుణాచల్ సీఎం
అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో అసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కలిఖో పాల్ ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి పీపుల్స్ పార్టీ ఆప్ అరుణాచల్లో (పిపిఎ) చేరారు. కలిఖో నేతృత్వంలో వీరు రాష్ట్ర ప్రభుత్వం తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం వారందరిని పక్కన పెట్టింది.
మాజీ ముఖ్యమంత్రి నబం టుకీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల నుంచి ఇద్దరు సభ్యులు లిబాంగ్, టటూంగ్ జమొహ్లు బుధవారం రాత్రి కలిఖో శిబిరంలో చేరారు. తాజా పరిణామాలతో శాసనసభలో కాంగ్రెస్ సంఖ్యాబలం పదిహేనుకు పడిపోయింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో మొత్తం 30 మంది సభ్యులు రాష్ట్రాభివృద్ధికి కోసం పిపిఎలో విలీనమవ్వాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సీఎం కలిఖో చెప్పారు.