అఫ్జల్ గురుకు నివాళి, భారత్ వ్యతిరేక నినాదాలు: కన్హయ్య కుమార్ పైన 1200 పేజీల ఛార్జీషీట్
న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ పైన ఢిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జీషీటు నమోదు చేశారు. 2016లో కన్హయ్య పైన నమోదైన దేశద్రోహం కేసుకు సంబంధించి పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించారు. సోమవారం పాటియాలా హౌజ్ కోర్టులో ఈ ఛార్జీషీట్ సమర్పించారు. రేపు (మంగళవారం) దీనిని పరిశీలిస్తారు.
పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు నివాళులు అర్పిస్తూ 9 ఫిబ్రవరి 2016 రోజున వర్సిటీ క్యాంపస్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కన్హయ్య కుమార్తో పాటు ఇతర విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలోనే కన్హయ్యతో పాటు పలువురు విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు ఛార్జీషీట్ రూపొందించి, ఇందులో పలువురి పేర్లు ప్రస్తావించారు. కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాఛార్య, అక్విబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీరా రసూల్, బషీర్ భట్తో పాటు పలువురి పేర్లు పొందుపరిచారు. ఈ పేర్లలో షీలా రషీద్, అపరాజిత రాజా (సీపీఐ నేత రాజా కూతురు) పేర్లు కూడా ఉన్నాయి.
ఈ ఛార్జీషీట్ పైన కన్హయ్య స్పందిస్తూ.. థ్యాంక్స్ మోడీ గారూ అని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఛార్జీషీట్ దాఖలు చేశారని, ఇది రాజకీయ కుట్రలో భాగమన్నారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.