coronavirus: కనికకు నాలుగోసారి పాజిటివ్ రావడంతో భావొద్వేగ లేఖ, నెక్ట్స్ టైం కచ్చితంగా నెగిటివే..
కనిక కపూర్.. బాలీవుడ్ సింగర్ కన్నా.. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిగా పేరు గడించారు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన కనిక.. తర్వాత కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత కూడా పార్టీలని తిరిగి.. రాజకీయ నేతలు, ప్రముఖులను ఆత్మరక్షణలోకి నెట్టేశారు. కరోనా వైరస్తో పోరాడుతున్న కనికకపూర్ నాలుగోసారి కూడా పాజిటివ్ రావడంతో భావొద్వేగంతో లేఖ రాశారు. ఆ లేఖను సోషల్ మీడియా ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేశారు.
భావొగ్వేగ లేఖ..
కనికకపూర్కు వైరస్ సోకిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తన మనస్సులోని భావాలను కనిక కపూర్ వ్యక్తపరిచారు. తాను ఐసీయూలో లేనని.. కానీ తన పిల్లలు, కుటుంబసభ్యులను ఎప్పుడెప్పుడూ కలుస్తాననే బెంగ మాత్రం ఉంది అని ప్రస్తావించారు. ప్రముఖ కొటేషన్ కూడా లేఖలో రాశారు. ‘సమయాన్ని సరిగా వినియోగించుకోవాలని జీవితం పాఠం నేర్పుతుంది. కానీ సమయం మాత్రం జీవితం యొక్క గొప్పదనాన్ని తెలుపుతుంది' అని రాశారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలని, తన పట్ల అభిమానులు శ్రద్ద చూపుతున్నందున ధన్యవాదాలు తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉంది అని.. మరోసారి జరిపే పరీక్షలో కరోనా నెగిటివ్ వస్తోందని భావిస్తున్నా... నెగిటివ్ వస్తే ఏం చక్కా కుటుంబంతో కలిసిపోతానని వివరించారు.
ఆందోళన
కనిక కపూర్కు వరసగా నాలుగోసారి కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. చికిత్సకు కనిక స్పందించడం లేదని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. కానీ ఆమెను మెరుగైన చికిత్స కోసం మరో చోటుకి తీసుకెళ్లలేమని తెలిపారు. లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో సాధ్యం కాదని.. ఆమె త్వరగా కోలుకోవాలని మాత్రమే ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా విమాన సేవలను కూడా కేంద్ర పౌరవిమానయాన శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
వైరస్తో పార్టీకి వెళ్లి..
ఇటీవల లండన్ నుంచి కనిక కపూర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పార్టీకి వెళ్లడంతో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా ఇతర నేతలు సెల్ప్ క్వారంటైన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కనిక కపూర్ను వెనకొసుకొచ్చిన సోనమ్ కపూర్ను నెటిజన్లు ఏకీపారేశారు. దీంతో కనిక కపూర్ కుటుంబసభ్యులు స్పందించారు. వెంటనే వైరస్ బయటపడలేదని పేర్కొన్నారు.