గెస్ట్హౌస్కు పిలిచి అత్యాచారయత్నం చేశాడు: నిర్మాతపై సినీ నటి
బెంగళూరు: షూటింగ్ కు వెళ్లిన సమయంలో గెస్ట్ హౌస్ లో తన మీద నిర్మాత అత్యాచారయత్నం చేశాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. బెంగళూరులో నివాసం ఉంటున్న కన్నడ నటి శివమొగ్గ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అంతే కాకుండా కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి, కర్ణాటక రాష్ట్ర మహిళ మండలి అధ్యక్షురాలు మంజుల మానసకు ఫిర్యాదు చేశారు. కుమార్ అనే నిర్మాత బిసిలు కుదురే (వేడి గుర్రం) అనే కన్నడ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ కోసం ఈ నెల 21వ తేదిన బెంగళూరు నుండి శివమొగ్గ కు యూనిట్ సభ్యులు వెళ్లారు. హీరో, హీరోయిన్ తో పాటు నటి,నటులు షూటింగ్ లో పాల్గోంటున్నారు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో బెంగళూరుకు చెందిన ఒక నటి నటిస్తున్నారు.
ఆమె శివమొగ్గ వెళ్లారు. అయితే సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత నిర్మాత కుమార్ తనతో మాట్లాడాలని చెప్పి తనను గెస్ట్ హౌస్ కు పిలిపించుకుని అత్యాచారయత్నం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఆ సందర్బంలో తాను తప్పించుకుని తన భర్తకు, పోలీసులకు ఫోన్ ద్వార ఫిర్యాదు చేశానని అంటున్నారు.
తన భర్త చెప్పినట్లు శివమొగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసి బెంగళూరు వచ్చి చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశానని అంటున్నారు. నటి భర్త నిర్మాత కుమార్ కు ఫోన్ చేస్తే కేసు వెనక్కి తీసుకొకుంటే చంపేస్తానని బెదిరించాడని వారు ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో ఉంది.