పార్టీలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని.. మామను 26 సార్లు పొడిచి చంపించిన కోడలు!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. పార్టీలకు వెళ్లకుండా అడ్డు వస్తున్నాడని ఇంట్లో సీసీటీవ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాడనే కోపంతో ఓ కోడలు ఏకంగా తన మామనే హత్యచేయించింది. కుటుంబంలో స్వేచ్ఛ లేకపోవడం, ఆర్థిక ఆంక్షలు, నిరంతర నిఘా కారణంగా కోడలు తన మామనే సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాన్పూర్లోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఫార్మా వ్యాపారవేత్త వినీత్ వినోచా(63) శనివారం రాత్రి తన ఫ్లాట్లో దారుణహత్యకు గురయ్యారు. దుండగులు ఆయనపై కత్తులతో దాడిచేసి ఏకంగా 26 సార్లు పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంట్లోని నగలు లేదా డబ్బు ఏమీ చోరీ కాకపోవడంతో పోలీసులు ఇది కావాలని చేసిన హత్యగా భావించి విచారణ వేగవంతం చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు
ఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా.. వినీత్ వినోచా కొడుకు, కోడలు పార్టీకి వెళ్లిన సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఒకరిని గతంలో వినీత్ వద్ద పనిచేసిన విశాల్గా, అతనికి సహకరించిన మరో వ్యక్తిని రాజ్కిషోర్గా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు సంచలన విషయాలను వెల్లడించారు. వినీత్ కోడలు షాలు వినోచాయే తమకు రూ.6 లక్షల సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని వారు అంగీకరించారు.
మామపై కక్షకు గల కారణాలు
అనంతరం పోలీసులు కోడలు షాలు వినోచాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. ఆమె నేరాన్ని అంగీకరించింది. విచారణలో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. వినీత్ వినోచా ఇంట్లో తీవ్రమైన నిఘా ఏర్పాటు చేశారు. ఇంట్లోని హాల్తో పాటు పలు చోట్ల సీసీటీవీ కెమెరాలు అమర్చి వారి కదలికలను నిరంతరం గమనిస్తుండేవాడు. ఆలస్యంగా ఇంటికి రావడం, పార్టీలకు వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కుటుంబంలో ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా ప్రతి చిన్న ఖర్చుకు తననే అడగాలని ఆంక్షలు విధించేవాడని తెలిపిరింది.
స్కెచ్ ప్రకారం హత్య
ఈ ఆంక్షలు, స్వేచ్ఛ లేకపోవడాన్ని తట్టుకోలేక మామను అడ్డు తొలగించుకోవాలని షాలు నిర్ణయించుకుంది. దీనికోసం గతంలో వారి ఇంట్లో పనిచేసిన విశాల్ కు రూ.6 లక్షలు ఆఫర్ చేసి ఇంటి అసలు తాళం ఇచ్చి డూప్లికేట్ తాళం తయారు చేయించింది. శనివారం రాత్రి భర్తతో కలిసి పార్టీకి వెళ్తూ నిందితులను ఇంట్లోకి పంపించింది. తొలుత దిండుతో ఊపిరి ఆడకుండా చేసి గుండెపోటుగా చిత్రీకరించాలని ప్లాన్ చేసినప్పటికీ.. వినీత్ మేల్కోవడంతో దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా 26 సార్లు పొడిచి హత్య చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న కాన్పూర్ పోలీసులు నిందితురాలు షాలుతో పాటు హత్యకు సహకరించిన విశాల్, రాజ్ కిషోర్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.














Click it and Unblock the Notifications
