కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు యాత్ర: సీనియర్, జూనియర్ నేతలకు సోనియా పిలుపు
ఉదయ్పూర్: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందని ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ అన్నారు. రాజస్థాన్ ఉదయ్పూర్లో జరిగిన నవసంకల్ప చింతన్ శిబిర్ ముగింపు సందర్భంగా సోనియా గాంధీ ప్రసంగించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' పేరుతో కాంగ్రెస్ యాత్ర చేపట్టనున్నట్లు సోనియా గాంధీ వెల్లడించారు. ఈ యాత్ర గాంధీ జయంతి అక్టోబర్ 2న రోజున ప్రారంభం కానుందని తెలిపారు.
దాడికి గురవుతున్న రాజ్యాంగ పునాది విలువలను కాపాడేందుకు, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తిచూపేందుకు ఈ 'భారత్ జోడో' యాత్ర సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సోనియా. దేశవ్యాప్తంగా యాత్రలు నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి కాంగ్రెస్ రెండో విడత జన జాగారణ్ యాత్ర మొదలవుతుందని సోనియా తెలిపారు. నిరుద్యోగం ప్రధాన అస్త్రంగా జనజాగరణ్ యాత్ర సాగుతుందన్నారు.
అంతేగాక, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సోనియా ప్రసంగం కొనసాగింది. సభకు తనలాంటి సీనియర్ నేతలంతా హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. సొంత కుటుంబంతో ఓ సాయంత్రం గడిపినట్లు ఉందన్నారు. పార్టీ తిరిగి బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ పుంజుకుంటాం అని బలంగా చెప్పిన సోనియా గాంధీ.. ఇది తమ సంకల్పం అని అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి ఈ సభ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ పుంజుకునేందుకు అందిన ప్రతిపాదనలను త్వరితగతిన చర్య తీసుకుంటామని హామి ఇచ్చారు.
కాగా, ఉదయపుర్లో వివిధ కమిటీలు చర్చించి, సూచించిన సంస్కరణల ప్రక్రియను మొదలుపెట్టేందుకు ఒక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సోనియాగాంధీ వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించే సంస్కరణలు, నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాలు, నియమాలు, కమ్యూనికేషన్లు, ప్రచారం, ఔట్రీచ్, ఆర్థిక, ఎన్నికల నిర్వహణతో సహా అన్ని అంశాలను టాస్క్ఫోర్స్ పరిశీలిస్తుందని వివరించారు.రెండు మూడు రోజుల్లో టాస్క్ఫోర్స్పై ప్రకటన ఉంటుందని తెలిపారు.
చింతన్ శిబిర్ ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగిందని అన్నారు సోనియా. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో మమేకమై చర్చలు జరిపేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడిందని చెప్పారు. సంస్థాగత మార్పులకు సంబంధించిన సూచనలు తక్షణమే అమలులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. 'చింతన్ శిబిర్ మంచి ఫలితాల సాధన దిశగా సాగింది. నిర్మాణాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో సూచనలను అందించడానికి నేతలకు అవకాశం వచ్చింది. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించడానికి సమావేశాలు ఉపయోగపడ్డాయి. ఆరు కమిటీల చర్చల్లో హాజరై నేను కూడా పలు సూచనలు చేశాను. పలువురు చేసిన ప్రతిపాదనలను తెలుసుకోగలిగాను. మూడు రోజుల పాటు ఇంత మంది నేతలతో సమయం వెచ్చించడం.. నా కుటుంబంతో గడిపినట్లు అనిపించింది' అని సోనియా పేర్కొన్నారు.