షాహీన్బాగ్ కాల్పులు : కపిల్ గుజ్జర్ ఎలాంటి వాడంటే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కుటుంబం
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ,షాహీన్బాగ్లలో వరుసగా చోటు చేసుకున్న కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటిదాకా ప్రశాంతంగా సాగిన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఒక్కసారిగా తుపాకీ చప్పుడు నిరసనకారుల్లో భయాన్ని నింపింది. రెండు వేర్వేరు ఘటనల్లో కాల్పులు జరిపిన ఆ నిందితులు ఇద్దరు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో షాహీన్బాగ్ కాల్పుల నిందితుడు కపిల్ గుజ్జర్ గురించి అతని కుటుంబం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అతను కాల్పులకు పాల్పడటానికి అసలు కారణం వేరే ఉందని చెప్పింది.
కపిల్ కలత చెందాడు.. : కపిల్ గుజ్జర్
నిజానికి కపిల్ గుజ్జర్(25) రాడికలైజ్ ఏమీ కాదని, కానీ ఆరోజు ప్రయాణ భారం ఎక్కువవడం వల్ల అలసిపోవడంతో పాటు కొంత కలత చెందాడని అతని కుటుంబం తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా రోడ్లు బ్లాక్ చేయడంతో..ఇంటికి చేరుకోవడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణంగా అయితే తమ డైరీ నుంచి ఇంటికి చేరుకోవడానికి 10కి.మీ దూరం ఉంటుందని,కానీ రోడ్లు బ్లాక్ చేయడంతో.. మరో మార్గం గుండా రావాల్సి వచ్చిందని తెలిపారు. తద్వారా 35కి.మీ ప్రయాణించి ఇంటికి చేరుకోవాల్సి వచ్చిందన్నారు.
రోడ్ల బ్లాక్ చేయడంతో..
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని దల్లుపురా,బదర్పూర్లో తమ కుటుంబం డైరీ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు కపిల్ కుటుంబ సభ్యులు తెలిపారు. సీఏఏ నిరసనల కారణంగా సౌత్ ఢిల్లీ నుంచి నోయిడా వెళ్లే మార్గం దాదాపుగా నెల రోజుల నుంచి బ్లాక్ అయిపోయింది. సాధారణ రోజుల్లో అయితే సౌత్ ఢిల్లీలోని బదర్పూర్ డైరీకి చేరుకోవడానికి అతనికి రెండు గంటలు సమయం పట్టేదని.. కానీ రోడ్లు బ్లాక్ అవడంతో ఆ సమయం మరింత పెరిగిందన్నారు. ఇది తమ బిజినెస్పై కూడా ప్రభావం చూపిందని వారు ఆరోపిస్తున్నారు.
కపిల్.. సాధారణ కుర్రాడు..
షాహీన్బాగ్లో కపిల్ గుజ్జర్ కాల్పుల ఘటన గురించి తెలిసి షాక్ తిన్నామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోజు చెప్పా పెట్టకుండా అతను బయటకు వెళ్లాడని.. అయితే క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నాడని అంతా భావించామన్నారు. అయితే ఇదంతా ఎలా జరిగిందో తమకు తెలియదని,గన్ ఎక్కడినుంచి తీసుకువచ్చాడో తెలియదని అతని తండ్రి అన్నారు. అతను చాలా సాధారణ కుర్రాడని,ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు.
ఎప్పుడూ డైరీ గురించే..
కపిల్ గుజ్జర్ ఎప్పుడూ తమ కుటుంబ డైరీ బిజినెస్ను ఎలా విస్తరించాలా అని ఆలోచించేవాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇటీవల తమ బంధువులకు సంబంధించిన ఓ వివాహ కార్యక్రమానికి కూడా తాము వెళ్లలేదని.. డైరీకి ఎక్కువ రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లలేదని చెప్పారు. కలిప్ అంకుల్ ఫతే సింగ్ మాట్లాడుతూ.. ఆరోజు కపిల్ అలసిపోయిన మాట నిజమే కానీ కాల్పులకు పాల్పడేంతగా కలత చెందాడనుకోవట్లేదని తెలిపారు.
రిపోర్టర్ కావాలనుకున్న కపిల్..
కపిల్ గుజ్జర్కు ఏడాది వయసున్న ఒక పాప కూడా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిజానికి కపిల్ ఒక రిపోర్టర్ కావాలనుకున్నాడని.. ఇందుకోసం ఢిల్లీలోని ఐఎంఎస్ కాలేజీలో చేరాడని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలేజీ నుంచి డ్రాపౌట్ అయ్యాడని చెప్పారు. అంతేకాదు,గత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2010లో బీఎస్పీ టికెట్పై జంగపుర నుంచి పోటీ చేసి ఓడిపోయినట్టు చెప్పారు.కపిల్ గుజ్జర్ ఇంకెవరి ప్రభావం చేతనైనా ప్రేరేపించబడవచ్చునని అతని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. అతను ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అతని వద్ద పిస్టల్ లేదన్నారు. అసలతను షాహీన్బాగ్ వైపు వెళ్తున్నాడని తెలిసి ఉంటే.. అటువైపు వెళ్లనిచ్చేవాళ్లం కాదని అన్నారు.
కపిల్ను ఇంకెవరో ప్రేరేపించారు..
కపిల్ సోదరుడు కుమార్ కూడా.. అతన్ని ఇంకెవరో ప్రేరేపించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.గ్రామంలో తమ కుటుంబానికి మంచి పేరు ఉందని, 8 ఇళ్లను ముస్లింలకు అద్దెకు ఇచ్చామని చెప్పారు.కపిల్కు ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారని.. పండగలప్పుడు వారు తమ ఇంటికి కూడా వస్తుంటారని చెప్పారు. ముస్లింలపై అతను విద్వేషపూరితంగా ఎప్పుడూ వ్యవహరించలేదని,మరే మతం పట్ల అతనెప్పుడూ తీవ్ర ఆలోచనలు కలిగి లేడని చెప్పారు.