షాకింగ్ : 15 ఏళ్ల బాలికపై 17 మంది 5 నెలలుగా అత్యాచారం... అత్త సహా 8 మంది అరెస్ట్...
కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై 17 మంది వ్యక్తులు ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమె అత్తమ్మ పాత్ర కూడా ఉండటం గమనార్హం. తల్లి చనిపోయిన నాటి నుంచి అత్తమ్మతో ఉంటూ కూలీ పనులకు వెళ్తున్న ఆ బాలికపై మొదట ఓ వ్యక్తి కన్ను పడింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ అతను... ఆ తర్వాత తన స్నేహితులకు ఈ విషయం చెప్పాడు. అలా అతని స్నేహితులు,ఇతరులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... బాధిత బాలిక(15) తల్లి మూడేళ్ల క్రితం చనిపోయింది. తండ్రి పట్టించుకోకపోవడంతో చిక్మంగళూరులోని అత్తమ్మ ఇంటికి వచ్చి ఉంటోంది. స్తానికంగా ఓ స్టోన్ క్రషర్ యూనిట్లో రోజూ కూలీ పనికి వెళ్తోంది. ఈ క్రమంలో ఆ బాలికకు గిరీష్ అనే బస్ డ్రైవర్ పరిచయమయ్యాడు. తన మాటలతో బాలికను మభ్యపెట్టిన అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక సెల్ఫోన్ నంబర్ను తన స్నేహితుడైన అభి అనే యువకుడికి ఇచ్చాడు.
మొదట అభి అనే వ్యక్తి లైంగిక దాడి..
అభి కూడా ఆమెతో ఫోన్లో మాటలు కలిపి,మాయ మాటలు చెప్పి ఆమెను ఆకర్షించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే గాక.. ఆ సమయంలో ఫోటోలు,వీడియోలు తీశాడు. ఇక వాటితో పదేపదే ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు,మరో 15 మంది అతని స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా గత 5 నెలలుగా బాలికపై వరుసగా లైంగిక దాడి చేస్తూనే ఉన్నారు.
అత్త సహా 8 మంది అరెస్టు...
ఈ ఘటన ఎలా బయటకొచ్చిందో తెలియదు కానీ మొత్తానికి చిక్మంగళూరులోని శృంగేరి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో బాలిక అత్తమ్మ కూడా ఉంది. బాలికపై జరుగుతున్న అత్యాచారం గురించి ఆమె అత్తమ్మకు తెలుసునని... ఈ మొత్తం వ్యవహారంలో ఆమె పాత్ర కీలకంగా ఉన్నదని అడిషనల్ ఎస్పీ తెలిపారు. నిందితులపై సెక్షన్లు 201,370,376(3),376(n) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video
బీజేపీ నేతలపై ఆరోపణలు...
ఈ ఘటనపై కర్ణాటక కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బల్లాల్ ట్విట్టర్లో స్పందించారు. దీనిపై ఎందుకు స్పందించట్లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి,ఎంపీ శోభ కరండ్లజేను ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో బీజేపీతో సంబంధం ఉన్నవారి పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. దేశంలో ఎక్కడ మహిళలు,చిన్నారులపై అత్యాచారాలు వెలుగుచూసినా... అందులో బీజేపీ ఎమ్మెల్యేలు,ఆ పార్టీ శ్రేణుల పేర్లు బయటపడుతున్నాయని ఆరోపించారు.