కర్ణాటక ఎన్నికలు, బీజేపీ మిషన్ 150 కాదు, మిషన్ ఇంపాజిబుల్, గుజరాత్ లో గురి తప్పింది, అంతే!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక శాసన సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే బీజేపీ నాయకులు అధికారంలోకి రావడానికి మిషన్ 150 అనే టార్గెట్ పెట్టుకున్నారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో 150 శాసన సభ సీట్లు గెలుచుకోవాలని కర్ణాటక బీజేపీ నాయకులు ప్రయత్నించారు. 150 నియోజక వర్గాల్లో తాము గెలుస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఢిల్లీలోని కొందరు బీజేపీ నాయకుల మాటల ప్రకారం మిషన్ 150 కాదు మిషన్ ఇంపాజిబుల్ అని వెలుగు చూసింది. గుజరాత్ లో గురి తప్పిందని అంటున్నారు.

మిషన్ 150 ఫ్లస్
కేంద్ర మంత్రి, బీజేపీ కర్ణాటక ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాష్ జావడేకర్ 2017 సెప్టెంబర్ లో కర్ణాటకలో పర్యటించారు. ఆ సందర్బంలో కర్ణాటక ఎన్నికల్లో మిషన్ 150 ప్లస్ తమ టార్గెట్ అని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. 150 సీట్లకు పైగా తాము కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ధీమా వ్యక్తం చేశారు.

దక్షిణ భారత్ లో అధికారం
కర్ణాటకలో 150 స్థానాలు కైవసం చేసుకుని దక్షిణ భారతదేశంలో జెండా ఎగరవేయాలని బీజేపీ ప్రయత్నించింది. ఇప్పటి వరకు బీజేపీ అనేక ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించింది. అయితే పోలింగ్ కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో బీజేపీ నాయకులు మిషన్ 150 విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు.

మాట మార్చిన ఢిల్లీ పెద్దలు
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తాము పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చామని, అయితే ప్రతిపక్షాలు మాత్రం తాము ఓడిపోయామని అంటున్నాయని, ఇంకా కొన్ని సీట్లు అక్కడ గెలిచి ఉంటే బాగుండేదని పేరు చెప్పడానికి ఇష్టపడిని ఢిల్లీకి చెందిన బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

నో మిషన్ 150
కర్ణాటకలో తాము మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు అన్నారు. అయితే గతంలో ప్రకటించిన మిషన్ 150 విషయంలో మాట్లాడటానికి ఆ బీజేపీ నేత తిరస్కరించారు.

గుజరాత్ లో గురి తప్పింది
గుజరాత్ లో 188 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. గుజరాత్ లో 150 స్థానాల్లో విజయం సాధిస్తామని 2017లో బీజేపీ నాయకులు ప్రకటించారు. అయితే 2017 డిసెంబర్ లో గుజరాత్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 99 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. గుజరాత్ లో బీజేపీ గురి తప్పిందని స్పష్టంగా వెలుగు చూసింది.

నిర్మలా సీతారామన్
కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకలో బీజేపీ సీట్ల గురించి ఇంత వరకూ ఎక్కడా అధికారికంగా మాకు ఇన్ని సీట్లు వస్తాయని మాట్లాడలేదని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత గుర్తు చేస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంతో సమీకరణాలు మారిపోతాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

21 ర్యాలీలలో ప్రధాని మోడీ
కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాల్లో మే 12వ తేదీన 223 నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ రెండు విడతలు కర్ణాటకు వచ్చి ఇప్పటి వరకూ 21 ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రానికి బహిరంగ సభలు, సమావేశాలకు తెరపడింది.












Click it and Unblock the Notifications