ఎన్నికల ప్రచారానికి తెర: ఎల్లుండి పోలింగ్: కర్ణాటకలో నిఘా
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవ్వాళ్లితో తెరపడనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ షెడ్యూల్ అయింది. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ వారం రోజులు- కర్ణాటక రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకమైనవి.
ఈ సాయంత్రానికి ప్రచారం ముగియనున్న నేపథ్యంలో చివరి రోజు అన్ని పార్టీలు.. తమ ప్రచార ఉధృతిని పెంచాయి. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. శని, ఆదివారాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో మెగా రోడ్ షో నిర్వహించారు. తొలి రోజు 26 కిలోమీటర్లు, రెండో రోజు ఏడు కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వేర్వేరు చోట్ల రోడ్ షో, బహిరంగ సభలను నిర్వహించారు.

ఆదివారం నాడే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ కూడా బెంగళూరులో ఎంట్రీ ఇచ్చారు. అనేకల్లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఆయన డెలివరీ బాయ్ స్కూటర్ మీద ట్రావెల్ చేశారు. శాంతలనగర్లోని ఓ హోటల్లో టిఫిన్ చేశారు. ఫుడ్ డెలివరీ బాయ్స్తో చిట్చాట్ చేశారు. వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం అనేకల్కు బయలుదేరి వెళ్లారు.
అదే రోజు రాత్రి బెంగళూరు మహదేవపురా నియోజకవర్గం పరిధిలో ప్రియాంక గాంధీ వాద్రా రోడ్ షో నిర్వహించారు. బీజేపీకి కంచుకోటగా చెప్పుకొనే నియోజకవర్గం ఇది. 2008 నుంచి ఇప్పటివరకు బీజేపీకి చెందిన అరవింద్ లింబావళి ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తోన్నారు. ఇక్కడ- ప్రియాంక గాంధీ చేపట్టిన రోడ్ షోనకు భారీగా జనం తరలివచ్చారు.

చివరి రోజు కావడం వల్ల అన్ని పార్టీలు తమ ప్రచార తీవ్రతను పెంచాయి. ఆయా పార్టీల జాతీయ నాయకులందరూ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రచారం ముగిసిన అనంతరం స్థానికేతరులెవ్వరూ ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా ఉంచింది. దీనికోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది ఈసీ.












Click it and Unblock the Notifications