Siddaramaiah:ఇవే నాచివరి ఎన్నికలు...ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ,బాంబు పేల్చిన సిద్ధ..!
మైసూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఏడాది మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీకి పోలింగ్ జరగనుండగా మే 13న ఫలితాలు వెలువడుతాయి. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ సారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కొన్ని ప్రధాన సీట్లపైనే చాలామంది దృష్టి ఉంది.అందులో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. ఇటు బీజేపీ- కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడనుండగా మరోవైపు జేడీఎస్ కింగ్ మేకర్గా అవతరిస్తుందా అనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ తలపెట్టిన జోడో యాత్రతో కాంగ్రెస్కు మంచి మైలేజ్ వచ్చింది. అంతేకాదు మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో క్యాడర్లో జోష్ ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ వృద్ధ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. తాను ఈ సారి వరుణ, కోలార్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు.

వరుణలో తాను జన్మించినట్లు చెప్పిన సిద్ధరామయ్య ఇక్కడి ప్రజల రుణం తీర్చుకునేందుకు వరుణ నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు. 2018లో చాముండేశ్వరీ, బాదామి నియోజకవర్గాల నుంచి సిద్ధరామయ్య పోటీ చేయగా.. బాదామిలో గెలుపొంది చాముండేశ్వరిలో ఓటమిపాలయ్యారు. 2018లో చాముండేశ్వరి నుంచి గెలుస్తాననే ధీమా లేదు కాబట్టి నాడు బాదామి నుంచి కూడా పోటీ చేసినట్లు సిద్ధరామయ్య చెప్పారు. అయితే ఈ 2023 ఎన్నికల్లో మాత్రం వరుణ నుంచి కచ్చితంగా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు సిద్ధరామయ్య.
కోలార్ నియోజకవర్గ ప్రజలు తనపై అత్యంత ప్రేమ విశ్వాసం కనబర్చారని, అక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నారని వెల్లడించారు.ఈ క్రమంలోనే కోలార్ నుంచి కూడా తనకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.2018లో వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పోటీ చేసి గెలుపొందారు. అయితే పాత మైసూరు ప్రాంతంలో ఉన్న కోలార్ నియోజకవర్గంకు తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటికే అక్కడ ప్రచారం ప్రారంభించినట్లు సిద్ధరామయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications