40 ఇయర్స్ ఇండస్ట్రీకి మోదీ అర్జెంట్ ఫోన్ కాల్: కొడుకు గురించి ఆరా
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య బీజేపీలో వరుసగా వికెట్లు పడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది సహా ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కమలానికి గుడ్బై చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్లల్లో జాయిన్ అయ్యారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తోన్న మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప- ఎన్నికల్లో పోటీ చేయట్లేదు.

ఆయన కుమారుడు బీవై విజేంద్రను ఎన్నికల రేసులో నిల్చోబెట్టింది బీజేపీ. యడ్యూరప్ప సొంత అసెంబ్లీ నియోజకవర్గం శికారిపురా నుంచి విజేంద్ర ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. తన మొత్తం ఆస్తుల విలువను 103.39 కోట్ల రూపాయలుగా చూపించారాయన. బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా మారారు యడ్యూరప్ప. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సాగిస్తోన్నారు.
అదే సమయంలో యడ్యూరప్ప తరహాలోనే పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప కూడా ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లేదు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీ నాడే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని, ఏ నియోజకవర్గానికి కూడా తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు.
కర్ణాటక రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది ఈశ్వరప్పకు. సాధారణ బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు ఎదిగారు. శివమొగ్గ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కంచుకోటగా మలిచారు. ఆ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని ఈశ్వరప్ప చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

శివమొగ్గ టికెట్ను ఎన్ చన్నబసప్పకు కేటాయించింది. దీనితో ఈశ్వరప్ప తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల్లో ప్రచారానికీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఈశ్వరప్పకు ఫోన్ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల తాజా పరిస్థితులపైనా ఆరా తీశారు. సీనియర్లు సహకరించాలని సూచించారు. టికెట్ దక్కకపోవడంపై బుజ్జగించారు.
మోదీ తనకు ఫోన్ చేయడం పట్ల ఈశ్వరప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలవబోతోన్నామని స్పష్టం చేశారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం- పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి- ఓ సామాన్య కార్యకర్తతో మాట్లాడటం గొప్ప విషయమని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications