కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: ఇక అక్కడ నేరమే
బెంగళూరు: గోవధను నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవధ నిసేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020కి కర్ణాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చవాన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
గోవధ నిషేధ బిల్లు ప్రకారం.. ఎవరైనా గోవధ, గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షకు అర్హులవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతేగాక, నిందితులపై వేగంగా విచారణ జరపడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా ఉందని తెలిపారు.
కాగా, చర్చ లేకుండానే ఈ బిల్లును సభలో ఆమోదించారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. బీఏసీ సమావేశంలో చర్చించకుండానే ఈ బిల్లును ఉన్నపళంగా సభలో ప్రవేశపెట్టారని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా వెల్ లోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Recommended Video
అయితే, ముఖ్యమైన బిల్లులను బుధ, గురువారాల్లో ప్రవేశపెడతామని సమావేశంలో స్పష్టంగా చెప్పినట్లు స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి చెప్పారు