Karnataka CM: బెంగళూరులో సందడే సందడి- లక్షమందితో..ఆ స్టేడియంలో సీఎంగా ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. దేశ రాజధాని వేదికగా మూడు రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ఇద్దరు ఉద్దండులు సిద్ధరామయ్య- డికే శివకుమార్ లల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయాలనే విషయంపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంది.
ఢిల్లీలో 10, జన్పథ్ నివాసంలో జరిగిన కీలకమైన సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సిద్ధరామయ్య కూడా ఇదే సమావేశంలో పాల్గొన్నారు. కొత్త ముఖ్యమంత్రిగా గురువారం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

డీకే, ఆయన వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత గల శాఖలను కేటాయించాలని షరతు ఉంది. డీకేకు విద్యుత్, జల వనరులు మంత్రిత్వ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఆయన వర్గానికి చెందిన ఎమ్యెల్యేల్లో ఇద్దరి నుంచి నలుగురిని కేబినెట్లో తీసుకోవాల్సి ఉంటుంది. వారికీ ప్రాధాన్యత గల శాఖలను కేటాయించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఖర్గే ప్రతిపాదించిన ఫార్ములాకు సిద్ధరామయ్య, డీకేశి అంగీకరించారు.
#WATCH | Supporters of Congress leader Siddaramaiah gather outside his residence in Bengaluru; pour milk over his poster#Karnatakacmsuspense pic.twitter.com/o8v1hhHhAC
— ANI (@ANI) May 17, 2023
సిద్ధరామయ్య గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి కూడా. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ మేరకు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ నుంచి రాజ్భవన్కు సమాచారం అందింది.

కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి పలువురు నాయకులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి రానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్గఢ్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్) సహా వివిధ రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హాజరు కానున్నట్లు సమాచారం.
సుమారు లక్షమందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారు కావడంతో ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. బెంగళూరులో పెద్ద ఎత్తున సందడి చేస్తోన్నారు. సిద్ధరామయ్య ఇంటి ముందు కోలాహలం నెలకొంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటోన్నారు. అక్కడ అమర్చిన సిద్ధరామయ్య ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లకు పాలాభిషేకాలను చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications