ఉక్రెయిన్లో మరణించిన కర్ణాటక విద్యార్థి పూర్తి వివరాలివే: షాప్కు వెళ్లి..తిరిగి రాని లోకాలకు
బెంగళూరు: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధంలో ఇన్ని రోజులూ ఏదైతే జరగకూడదని భయపడుతూ వచ్చారో.. అది సంభవించింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక బలగాలు కురిపిస్తోన్న నిప్పులవానలో భారత విద్యార్థి ఒకరు మరణించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్పై రష్యా సైన్యం చేస్తోన్న దాడుల్లో భారత విద్యార్థి మృత్యువాత పడినట్లు తెలిపింది. ఆ విద్యార్థి కుటుంబంతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

భారత విద్యార్థి మృతికి..
ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఓ భారతీయ విద్యార్థి మరణానికి దారి తీశాయి. రష్యా సైనికులు ఎడతెరిపి లేకుండా జరుపుతోన్న దాడుల సందర్భంగా ఆ విద్యార్థి మరణించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్లోని భారత రాయబారి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. భారత్లోని ఆ విద్యార్థి కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశామని అన్నారు. కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన.

కర్ణాటక విద్యార్థిగా..
ఖార్కీవ్లో మరణించిన విద్యార్థి స్వరాష్ట్ర కర్ణాటకగా గుర్తించారు అధికారులు. ఆయన పేరు నవీన్ శేఖరప్ప. కర్ణాటక హవేరి జిల్లాలోని చాలగెరి ఆయన స్వస్థలం. ఖార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతున్నట్లుగా తెలిస్తోంది. ఖార్కీవ్లో ఆయన తన స్నేహితులతో కలిసి నివసిస్తోన్నారు. ఖార్కీవ్పై రష్యా సైనిక బలగాలు ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన స్నేహితులతో కలిసి అండర్గ్రౌండ్లో తలదాచుకున్నారు.

షాప్కు వెళ్లి..
ఈ ఉదయం ఆహార పదార్థాలను తెచ్చుకోవడానికి షాప్కు వెళ్లిన సమయంలో సంభవించిన బాంబు దాడుల్లో నవీన్ శేఖరప్ప మృతి చెందారు. ఆయన మరణించినట్లు తొలుత అతని స్నేహితుడికి ఫోన్ చేశారు. ఆ వెంటనే అతను ఈ విషయాన్ని కీవ్లోని భారత రాయబార కార్యాలయానికి తెలియజేశారు. ఈ విషయాన్ని భారత రాయబారి అరిందమ్ బాగ్చీ.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలిపారు. వారు కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమిషనర్కు సమాచారం ఇచ్చారు.

మూడు రోజుల్లో..
నవీన్ శేఖరప్ప మరణించిన విషయం తనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తెలిసిందని కర్ణాటక ఎస్డీఎంఏ కమిషనర్ మనోజ్ రాజన్ తెలిపారు. కాగా- ఈ సమాచారం తెలిసిన వెంటనే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నవీన్ శేఖరప్ప కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో మృతదేహాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. నవీన్ శేఖరప్పది దిగువ మధ్య తరగతి కుటుంబంగా చెబుతున్నారు.
Recommended Video

ఖార్కీవ్పై రష్యా తీవ్ర దాడులు..
ఖార్కీవ్ నగరం.. ఇప్పుడు మరుభూమిగా మారింది. ఈ తెల్లవారు జాము నుంచీ రష్యా సైనిక బలగాలు ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. పెద్ద ఎత్తున దాడులకు దిగాయి. రాకెట్లతో విరుచుకుపడ్డాయి. ఈ నగరంలో భారీ ఎత్తున కాల్పులు సంభవిస్తున్నట్లు ఖార్కీవ్ మేయర్ సైతం ధృవీకరించారంటే- అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రష్యా సైనికుల దాడుల్లో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. ఎటు నుంచి ఏ రాకెట్ వచ్చి వాలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications