నిప్పులా కావేరి, తమిళనాడుకు నీళ్లు ఇవ్వం: సిద్దు
బెంగళూరు: కావేరీ జలాలను తమిళనాడుకు ఈనెల 23వ తేది వరకు వదిలేది లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. బుధవారం రాత్రి కర్ణాటక అఖిలపక్ష సమావేశం, అత్యవరసర మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు.
బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. గవర్నర్ అనుమతితో ఈనెల 23వ తేదిన ఒక రోజు ప్రత్యేక ఉబయ సభల సమావేశం నిర్వహిస్తామని, ఆరోజు కావేరీ జలాల పంపిణిపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అప్పటి వరకు తమిళనాడుకు కావేరీ జలాలు విడదల చెయ్యరాదని అఖిలపక్ష సమావేశం, మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వివరించారు. మాకే నీళ్లు లేవు, ఇక తమిళనాడుకు ఎక్కడి నుంచి నీళ్లు వదిలిపెట్టాలని ఆయన ప్రశ్నించారు.
ఈనెల 23వ తేది తరువాత ఉబయ సభల్లో ఈ విషయం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతిని కలుస్తామని సిద్దరామయ్య చెప్పారు. కావేరీ జలాలను ఈనెల 21వ తేది నుంచి 27వ తేది వరకు తమిళనాడుకు వదిలిపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రజలు మండిపడ్డారు. అప్పటి నుంచి సిద్దరామయ్య ప్రభుత్వం ఆయోమయంలో పడింది. బుధవారం రాత్రి జరిగిన అఖిల పక్ష సమావేశానికి జేడీఎస్ హాజరైయ్యింది. బీజేపీ బైకాట్ చేసింది.
అయితే సిద్దరామయ్య ప్రభుత్వం తమిళనాడుకు నీరు వదిలిపెట్టరాదని మంచి నిర్ణయం తీసుకుందని బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అన్నారు.
తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యరాదని నిర్ణయం తీసుకున్న తరువాత ఈ విషయంలో న్యాయపోరాటం చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది. ఇప్పటికే న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చిస్తున్నారు.