విదేశాలకు వందే భారత్ రైళ్లు? గ్లోబల్ ట్రాక్స్పై ఇండియా జెండా!
భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సెమీ-హై-స్పీడ్ రైలు 'వందే భారత్’.. ఇప్పుడు ప్రపంచ దేశాల ట్రాక్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మన దేశీయ అవసరాల కోసమే బ్రాడ్-గేజ్ పట్టాలపై నడిచిన ఈ ఆధునిక రైళ్లను, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 'స్టాండర్డ్-గేజ్’ ప్లాట్ఫామ్పై సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు. 'మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ప్రపంచ మార్కెట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా భారతీయ రైల్వేస్, ప్రభుత్వ రంగ కన్సల్టెన్సీ సంస్థ 'రైట్స్ లిమిటెడ్’ (RITES) సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టాయి.
గ్లోబల్ మార్కెట్లే టార్గెట్.. క్యూ కడుతున్న పొరుగు దేశాలు!
ప్రపంచవ్యాప్తంగా మెట్రో నెట్వర్క్లు, హై-స్పీడ్ రైలు కారిడార్లలో ఎక్కువగా ఇరుకైన 'స్టాండర్డ్-గేజ్' ట్రాక్ స్పెసిఫికేషన్లనే వాడుతుంటారు. అందుకే విదేశాలకు వీటిని భారీగా ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ప్రతినిధి బృందాలు భారతదేశాన్ని సందర్శించి ఈ రైళ్ల పనితీరును అంచనా వేశాయి. వీటితో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు కూడా వందే భారత్ రైళ్లను కొనుగోలు చేయడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నాయని రైట్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ మిథాల్ వెల్లడించారు. విదేశీ కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి వీలుగా ఒక 'వందే భారత్’ రైలును ట్రయల్ రన్ కోసం విదేశీ మార్కెట్లలో మోహరించాలని రైట్స్ ప్రతిపాదించింది.

శరవేగంగా డిజైన్ పనులు.. తక్కువ ధరలోనే లగ్జరీ ప్రయాణం
ప్రస్తుతం ఈ స్టాండర్డ్-గేజ్ వందే భారత్ రైళ్లు డిజైన్-అభివృద్ధి దశలో ఉన్నాయి. ఆర్డర్లు ఖరారైన వెంటనే చెన్నై (ICF), కపుర్తల (RCF), రాయ్బరేలి (MCF) కోచ్ ఫ్యాక్టరీల్లో వీటి ఉత్పత్తి ప్రారంభం కానుంది. మన దేశంలో ఒక 16-కోచ్ వందే భారత్ రైలు తయారీకి సుమారురూ.130 నుంచిరూ.150 కోట్లు ఖర్చవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోని మిగతా హై-స్పీడ్ రైళ్లతో పోలిస్తే ఈ ధర చాలా తక్కువ.
ఈ కాస్ట్ అడ్వాంటేజ్ కారణంగా తమ నగరాల మధ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనుకునే ఏ దేశానికైనా వందే భారత్ అత్యుత్తమ ఛాయిస్గా మారనుంది. కాగా, దేశీయ డిమాండ్ పూర్తిగా తీరిన తర్వాతే పూర్తిస్థాయి ఎగుమతులు ఉంటాయని, అయితే ఈలోపు అవసరమైతే ప్రస్తుత బ్రాడ్-గేజ్ రైళ్లను కూడా పొరుగు దేశాలకు పంపే యోచనలో అధికారులు ఉన్నారు.
2047 నాటికి 4,500 రైళ్లు.. దేశీయంగా నూటవ రేక్ పూర్తి!
ఇదిలా ఉంటే, దేశీయంగా వందే భారత్ విస్తరణ జెట్ స్పీడ్తో సాగుతోంది. ఈ నెల ప్రారంభంలోనే రాయ్బరేలి మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ తన 100వ వందే భారత్ రైలుసెట్ను విజయవంతంగా విడుదల చేసింది. 2019లో గరిష్టంగా 160 కి.మీ./గం. వేగంతో నడిచే రెండు రైళ్లతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు 180 కి.మీ./గం. వేగంతో దూసుకెళ్లే స్థాయికి చేరింది. భవిష్యత్తులో కేవలం చైర్ కార్లకే పరిమితం కాకుండా 'స్లీపర్’ వేరియంట్లను కూడా ప్రవేశపెడుతున్నారు. 2030 నాటికి 800 రైలుసెట్లను, శతాబ్ది ఉత్సవాల నాటికి అంటే 2047 నాటికి ఏకంగా 4,500కు పైగా వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని రైల్వే సంస్థ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
దూసుకుపోతున్న 'రైట్స్’ ఆర్డర్ బుక్
వందే భారత్ ప్రాజెక్టుతో పాటు ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల్లో 'రైట్స్’ సంస్థ తన సాధారణ రైలు ఎగుమతుల వ్యాపారాన్ని కూడా భారీగా విస్తరిస్తోంది. ఇప్పటికే మొజాంబిక్ దేశానికి 10 లోకోమోటివ్లను విజయవంతంగా సరఫరా చేయగా, మరో 5 ఇంజన్ల కోసం కొత్త ఆర్డర్లు వచ్చాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 200 రైలు కోచ్ల ఆర్డర్లో భాగంగా మొదటి 20 కోచ్ల శాంపిల్ బ్యాచ్కు ఢాకా ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక విదేశీ ఆర్డర్ సాధించాలనే పట్టుదలతో ఉన్న రైట్స్ లిమిటెడ్.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏకంగా రూ.9,416 కోట్ల భారీ ఆర్డర్ బుక్ను సొంతం చేసుకుంది. ఇందులో ఎగుమతి ఆర్డర్ల వాటాయే రూ.2,100 కోట్లు కావడం విశేషం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్డర్ బుక్ను రూ.10,000 కోట్లకు పైగా పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.














Click it and Unblock the Notifications