ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం.. వెంకన్న దయ!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ పేదలు, నిరుపేదలకు అపర సంజీవనిగా నిలుస్తోంది. ఆర్థిక సమస్యల వల్ల సరైన వైద్యం అందకుండా ఇబ్బంది పడుతున్న వందలాది కుటుంబాలకు ఈ ట్రస్ట్ ఉచితంగా అధునాతన వైద్య సేవలు అందిస్తోంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో లభించే స్థాయి చికిత్సను పేదలకు అందించడం ఈ ట్రస్ట్ ప్రత్యేకత.
ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ప్రత్యేకదృష్టి
2001 అక్టోబర్ 1న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ట్రస్టును ప్రారంభించారు. ప్రారంభంలో స్విమ్స్ శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 50 మంది రోగులతో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ సేవ ఇప్పుడు వేలాది మంది పేద రోగుల ప్రాణాలను కాపాడుతోంది. గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యం, క్యాన్సర్, థలసేమియా, హీమోఫీలియా, నాడీ సంబంధిత వ్యాధులు వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ప్రత్యేకదృష్టి సారిస్తోంది.

నిరుపేదలకు ఉచిత చికిత్స
పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులను ఎంపిక చేసి ఉచిత చికిత్స అందిస్తారు. డాక్టర్లు ప్రాథమిక పరీక్షలు చేసి, అవసరమైతే శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. సర్జరీ తర్వాత మందులు, ఆహారం, ఫాలో-అప్ చికిత్సలు కూడా ఉచితంగా అందిస్తారు. కిడ్నీ మార్పిడి వంటి కేసుల్లో ఒక సంవత్సరం పాటు మందులు ఉచితంగా ఇస్తారు.
రూ.520 కోట్లకు ట్రస్ట్ ఫండ్
ట్రస్టు ద్వారా ఇప్పటివరకు సుమారు 30,000 మంది రోగులకు రూ.160 కోట్లు ఖర్చు చేసి సేవలు అందించింది. ట్రస్టు ఫండ్ ప్రస్తుతం రూ.520 కోట్లకు చేరుకుంది. దాతల నుంచి వచ్చిన విరాళాలే ఈ సేవకు మూలం. రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్న ట్రస్టు ఇప్పటివరకు 2.5 లక్షల మందికి ఉచిత మందులు పంపిణీ చేసింది.
ఈ ట్రస్ట్ కు విరాళాలు ఇస్తే ఇదే బెనిఫిట్
ఎవరైనా ఈ ట్రస్టుకు విరాళాలు ఇవ్వవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు సౌకర్యం కూడా ఉంది. విరాళం మొత్తం ఆధారంగా దాతలకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. మరిన్ని వివరాలకు www.tirumala.org వెబ్సైట్ లేదా 0877-2264258 నంబర్ను సంప్రదించవచ్చు. ఈ ట్రస్ట్ ద్వారా తిరుమల వెంకటేశ్వర స్వామి పేదలకు నిజమైన రక్షణగా నిలుస్తున్నాడని భక్తులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications